క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. పార్టీ పెట్టినప్పటి నుండి అంటిపెట్టుకుని ఉన్న బిసి సామాజికవర్గం తెలుగుదేశంపార్టీకి దూరమవుతున్నదా ? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు బిసి సామాజికవర్గం షాక్ తప్పదనే ప్రచారం మొదలైపోయింది. ఇక నుండి బిసిల ఓట్లు గంపగుత్తగా టిడిపికి పడే అవకాశం లేదనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబులో ఆలోచన మొదలైన తర్వాత బిసిల్లో కూడా టిడిపికి దూరమవ్వాలన్న ఆలోచన మొదలైనట్లే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ తో పొత్తుకే మొగ్గు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం బహిరంగంగా ప్రకటన చేయకపోయినా అందరికి ఆ విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే, గతంలో ఎన్నడూ లేనంతగా చంద్రబాబు కాంగ్రెస్ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధితో బెంగుళూరు పర్యటనలో సన్నిహితంగా ఉండటం, హైదరాబాద్ లో పారిశ్రామివేత్తలతో రాహూల్ నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హాజరవ్వటం లాంటివి కాంగ్రెస్-టిడిపి చెలిమికి ప్రధాన సంకేతాలు.
చంద్రబాబుకు షాకిచ్చిన మంత్రులు
సరే ఇవన్నీ పక్కనపెడితే రెండు రోజుల క్రితం అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ తో పొత్తుల విషయాన్ని చర్చించారు. సరే, యధావిధిగా అందరూ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లే మాట్లాడారు. అంత వరకూ బాగానే ఉంది కానీ తర్వాతే కథ అడ్డం తిరుగుతోంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్ తో టిడిపి పొత్తుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే జనాలు బట్టలూడదీసి కొడతారంటూ చింతకాయల చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. కెఇ, చింతకాయల మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు షాకిచ్చేవే అనటంలో సందేహం లేదు.
సామాజికవర్గం ఆలోచనలేనా ?
విషయం ఏమిటంటే చంద్రబాబు ఆలోచనలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న మంత్రులిద్దరూ బిసి సామిజికవర్గానికి చెందిన వారే. బిసి సామాజిక వర్గాలు నిర్వహించే సమావేశాల్లో ఈ మంత్రులు తరచూ పాల్గొంటుంటారు. సామాజికవర్గానికి చెందిన నేతల మనోభావాలు తెలుసుకోకుండడానే మంత్రులిద్దరూ చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే అవకాశాలు తక్కువే. మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ తో టిడిపి పొత్తును సామాజికవర్గం కూడా వ్యతిరేకిస్తున్నదా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
చెత్త నెత్తినేసుకుంటున్నారా ?
మంత్రులు తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజికవర్గం మనోభావాలే అయితే టిడిపికి పడే బిసి ఓట్లలో చీలిక తప్పదనే అనుమానించాలి. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని ఇచ్చిన హామీతో బిసిల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దానికి కాంగ్రెస్ తో పొత్తు బోనస్ గా తోడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే మంత్రులిద్దరు మాత్రమే మాట్లాడారు. భవిష్యత్తులో ఇంకెంతమంది మంత్రులు, నేతలు వ్యతిరేకిస్తారో తెలీదు. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే చెత్తను తనంతట తానే నెత్తినేసుకుంటున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.