చంద్రబాబునాయుడుకు ఊహించని రీతిలో కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ప్రోటోకాల్ కు సంబంధించి రాష్ట్రంలోని వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిల విషయంలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదే విధంగా చంద్రబాబు విషయంలో కేంద్రం వ్యవహరించింది. తనకు జరిగిన అవమానానంపై చంద్రబాబు మింగలేక కక్కలేక నానా అవస్తలు పడుతున్నారు.
ఎస్పీఏలో కనబడని సిఎం
ఇంతకీ విషయం ఏమిటంటే, విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనాలు ప్రారంభమయ్యాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు భవనాలను ప్రారంభించారు. మామూలుగా అయితే, ఎంత చిన్న ఫంక్షన్ అయినా రాష్ట్రానికి వెంకయ్య వస్తున్నారంటే చంద్రబాబు అక్కడ వాలిపోతారు. గడచిన నాలుగేళ్ళుగా ఈ విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది ఎస్పిఏ భవనాల ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఎక్కడా కనబడలేదు. ఎందుకు ?
ఇన్విటేషన్లో పేరే వేయలేదు
ఎందుకంటే, ఎస్పీఏ అన్నది పూర్తిగా కేంద్రప్రభుత్వ సంస్ధ. ఈ సంస్ధకు రాష్ట్రప్రభుత్వంతో ఎటువంటి సంబంధమూ లేదు. అటువంటి ఎస్పీఏ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం ఆహ్వనపత్రాలను ముద్రించి పంపిణీ చేసింది. అందులో ముఖ్య అతిధుల జాబితాలో ఉప రాష్ట్రపతి, గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్లున్నాయే కానీ ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. ఈ కార్యక్రమానికి వెంకయ్యతో పాటు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అతిధులుగా హాజరయ్యారు. కనీసం ఎంపి కేశినేని నానిని కూడా కేంద్రం ఆహ్వానించలేదు. మామూలుగా అయితే సంస్ధ ఎవరిదైనా ముఖ్యమంత్రి, ఎంపి పేర్లు వేయటం సహజం. కానీ ఇక్కడ ఆ ప్రోటోకాల్ ను కూడా కేంద్రం పట్టించుకోలేదు. కార్యక్రమానికి పూర్తిగా దూరం పెట్టటమంటే చంద్రబాబును అవమానించటమే. ఒకవేళ చంద్రబాబును పిలిస్తే ఎస్పీఏని తానే సాధించానని ప్రచారం చేసుకుంటారని అనుమానం వచ్చిందో ఏమో కేంద్రానికి ? అందుకనే అసలు ఇన్విటేషన్లోనే చంద్రబాబు పేరు లేకుండా చేసేసింది.