తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పొత్తుల విషయంలో చంద్రబాబునాయుడును హెచ్చరిస్తున్నట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి టిడిపి-కాంగ్రెస్ పొత్తులపై తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. నేతలను కూడా అందుకు తగ్గట్లే సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో కాంగ్రెస్ తో పొత్తుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే.
అనధికారికంగా పొత్తు నిర్ణయం
అధికారికంగా పొత్తులపై చంద్రబాబు ప్రకటించకపోయినప్పటికీ అనధికారికంగా దాదాపు అయిపోయినట్లే. ఎప్పుడైతే ఆ విషయం చంద్రబాబు నోటి వెంట బయటకు వచ్చిందో మంత్రులు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎదురుతిరిగారు. దాంతో తెలుగుదేశంపార్టీలో పెద్ద రచ్చే జరుగుతోంది.
పరోక్ష హెచ్చరికలేనా ?
కాంగ్రెస్ తో పొత్తుల విషయం ఎప్పుడైతే మీడియాలో వైరల్ అయ్యిందో ఆ విషయం వెంకయ్యనాయుడు దృష్టిలో కూడా పడినట్లుంది. వెంటనే తనను కలసిన ఆప్తులతో మాట్లాడుతూ, ఒకపుడు కాంగ్రెస్ మీదున్న వ్యతిరేకతతోనే టిడిపి వ్యవస్దాపకుడు తన గెలుపుకు సహకరించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒక్క కారణం వల్లే 1983 ఎన్నికల్లో తన గెలుపుకు ఎన్టీఆర్ సహకరించారని చెప్పారు. అంటే ఎన్టీఆర్ టిడిపి పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అన్న విషయాన్ని చంద్రబాబుకు వెంకయ్య గుర్తు చేస్తున్నట్లే ఉంది. కాంగ్రెస్ తో పొత్తంటే ఎన్టీఆర్ అభిమానులే కాదు జనాలు కూడా హర్షించరన్న హెచ్చరిక కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. ఉప రాష్ట్రపతి అయిన కారణంగా వెంకయ్య ప్రత్యక్షంగా కలవలేక పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు టిడిపిలోనే చర్చ మొదలైంది.