భారత దేశంలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటారని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కాకపోతే అప్పుడప్పుడు కొంత మంది రాజకీయ ప్రయోజనం కోసం వీరి మద్య తగువు పెట్టడం..కలకలం రేపడం జరుగుతుంది..ఏది ఏమైనా భారతావనిలో అందరూ సహోదరభావంతో మెసలుతున్నారు. తాాజాగా కేరళాలో జరిగిన సంఘటన యావత్ భారత దేశాన్ని ఆశ్చర్యపర్చడమే కాదు..వారికి సలాం చేసేలా చేసింది. మానవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు.
కేరళను అతలాతకుతలం చేసిన భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. అక్కడే సమీపంలో ఉన్న రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము.
కానీ నీరు అలాగే ఉండటంతో దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. వరద నీటి కారణంగా అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్ లో విష్ణుమూర్తి ఆలయాన్ని.. మల్లప్పురంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని కొందరు ముస్లింలు శుభ్రం చేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి.