విశాఖ జిల్లాలో వైసీపీకి జనాదరణ ఉంది కానీ సంస్థాగతంగా వీక్ గా ఉంది చెప్పుకోదగిన నాయకులు ఆ పార్టీలో లేరు. దాంతో జనాలలో ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీసొమ్ము చేసుకోలేకపోతోంది. గత పది రోజులుగా జగన్ పాదయాత్ర జిల్లాలో సాగుతోంది. పార్టీ ప్లస్ మైనస్ లను ఆయన కళ్ళారా చూస్తూ వస్తున్నారు. రిపేర్లు చాలానే చేయాలని ఆలోచిస్తున్నారు.
ఆ ఇద్దరిపైనా చూపు :
వైసీపీకి
ముఖ్యంగా సిటీలో పేరున్న నాయకులు లేరు. అంతా ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఆ పార్టీకి ఉంది. దాంతో ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీయాలనుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులపై పార్టీ పెద్దల కన్ను పడిందని అంటున్నారు. ఈ ఇద్దరు రెండేసి మార్లు ఎమ్మెల్యేలుగా గెలవడమే కాదు, జిల్లాలో కాంగ్రెస్ కి కాపు కాస్తున్నారు.
వస్తే టిక్కెట్లు ష్యూర్ :
విశాఖ సిటీలో ద్రోణంరాజు శ్రీనివాస్ కి ఆయన గారి తండ్రి రూపేణా మంచి పేరు ఉంది. కొంత క్యాడర్ కూడా ఉంది.బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కనుక వైసీపీలో చేరితే విశాఖ సిటీలో ఆ పార్టీకి ప్లస్ అవుతుంది, సిటీ పరిధిలో బ్రాహ్మణుల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అదే విధంగా తటస్థులు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అక్కడ ఆయనే బలం :
ఇక విశాఖ ఏజెన్సీలో వైసీపీకి మంచి బలం ఉంది. ఆ బలంతోనే గత ఎన్నికలలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను సులువుగా గెలిపించుకుంది. తీరా గెలిచాక వారంతా పార్టీ ఫిరాయించారు. ఇపుడు జనంలో ఉన్న ఓట్లను తీసుకుని గెలిచే నాయకుడు అక్కడ కావాలి. అరకు వరకూ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఉన్నా, పాడేరు అనాధలా మారింది. ఇక్కడ సరైన లీడర్ షిప్ లేదు.దాంతో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బాలరాజుకు వైసీపీ చాన్నాళ్ళుగా గేలం వేస్తోంది. ఆయన వస్తే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామంటోంది.
అలా జరుగుతుందా :
ద్రోణంరాజు శ్రీనివాస్, బాలరాజులిద్దరూ కాంగ్రెస్ కి నిబద్దత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఓ దశలో వీరు పార్టీ మారుతారని ఊహాగానాలు వచ్చినా ఖండించారు.. బాలరాజు ఏకంగా రాహుల్ గాంధీ గుడ్ లుక్స్ లో ఉన్నారు. ద్రోణం రాజు ఫ్యామిలి హస్తం పార్టీకే అంకితమైంది. కానీ రాజకీయాలను ఎపుడూ ఒకేలా చూడలేం. మరో ఆరేడు నెలలలో జరగనున్న ఎన్నికలలో ఏమైనా జరగవచ్చు. అందువల్లనే వైసీపీ వీరిద్దరిపైనా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఏం జరుగుతుందో చూడాలి.