చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ పొత్తుల సెగ బాగానే తగులుతున్నట్లుంది. మూడు రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు ఒక విధంగా షాక్ కొట్టినట్లైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదారిని ఈదాలని అనుకుంటున్న చంద్రబాబు ఆలోచనలకు సీన్ రివర్స్ అవుతోంది. దాంతో సిఎంలో టెన్షన్ పెరిగిపోతోంది. తన ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రులపై ఇపుడు చంద్రబాబు మండిపోతున్నారు.
ఫీలర్ కు రియాక్షన్
ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ విషయంలో దాదాపు నిర్ణయం కూడా అయిపోయింది. కాకపోతే బహిరంగంగా ప్రకటన మాత్రం చేయలేదు. కాంగ్రెస్ తో పొత్తంటే పార్టీ నేతలతో పాటు జనాలు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనే విషయంలో చంద్రబాబు ఒక ఫీలర్ వదిలారు. ఫీలర్ వదిలిన తర్వాత వచ్చిన రియాక్షన్ చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే, రియాక్షన్ అనుకున్నదానికంటే చాలా తీవ్రంగా ఉండటమే కారణం.
తట్టుకోలేకపోతున్న చంద్రబాబు
అందులోనూ వచ్చిన రియాక్షన్ కూడా మంత్రివర్గంలోని సీనియర్ సహచరుల నుండే కావటంతో చంద్రబాబ తట్టుకోలేకపోతున్నారు. అందులోనూ సీనియర్లు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా ముందే తమ వ్యతిరేకతను వ్యక్తం చేయటంతో చంద్రబాబు అసలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ప్లేటు మార్చేశారు. పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏంటంటూ వారిపై మండిపడుతున్నారు. త్వారలో వారిద్దరినీ పిలిచి వివరణ కోరాలని కూడా నిర్ణయించటమే చంద్రబాబుకు ఏ స్దాయిలో నిరసన సెగ తగులుతోందో అర్ధమైపోతోంది.