జనసేనలోకి త్వరలో 20 మంది ఎంఎల్ఏలు జంప్ చేయటానికి సిద్ధంగా ఉన్నారా ? ఆ పార్టీ నేతలు చెబుతున్న ప్రకారమైతే నిజమే. కానీ ఆ పార్టీకి అంత సీన్ ఉందా అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి రావటానికి 20 మంది ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నట్లు జనసేన కన్వీనర్ పార్ధసారధి చెప్పారు. ఆయన చెప్పినట్లు 20 మంది ఎంఎల్ఏలంటే అయితే, తెలుగుదేశంపార్టీ లేకపోతే వైసిపికి మాత్రమే ఎంఎల్ఏలున్నారు. కాబట్టి రెండు పార్టీల నుండి ఎంఎల్ఏలు వెళ్ళిపోవాలి. ఎంఎల్ఏలే కాకుండా ఇతర పార్టీల్లోని చాలా మంది సీనియర్ నేతలు రెడీగా ఉన్నారట జనసేనలో చేరటానికి.
ఇంతకీ ఎవరా 20 మంది ?
ఇంతకీ జనసేనలో చేరటానికి రెడీగా ఉన్న ఎంఎల్ఏలెవరో ఏ పార్టీ వాళ్ళో చెప్పలేదు. కన్వీనర్ చెప్పింది కాసేపు నిజమే అనుకున్నా ఆ 20 మంది ఎంఎల్ఏలు ఎవరో చూద్దాం. ప్రాపబులిటీ చూస్తే చేరబోయే ఎంఎల్ఏల్లో ఎక్కువ మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే అయ్యుండాలి. ఇక ఉభయ గోదావరి జిల్లాలంటే తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలకే అవకాశం ఉంది. ఎందుకంటే, పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మంది ఎంఎల్ఏల్లో వైసిపికి ఒక్కళ్ళు కూడా లేరు.
టిడిపికే దెబ్బ
ఇక, తూర్పు గోదావరి జిల్లాలో 19 మంది ఎంఎల్ఏలున్నారు. పోయిన ఎన్నికల్లో గెలిచిన 6 మంది వైసిపి ఎంఎల్ఏల్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పార్టీలో ఉన్నారు. అంటే మిగిలిన 16 మంది టిడిపి ఎంఎల్ఏలే. మిగిలిన ముగ్గురు గెలిచి నాలుగేళ్ళవుతున్నా టిడిపిలోకి ఫిరాయించలేదంటే ఇపుడు జనసేనలోకి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువనే అనుకోవాలి. సో, ఎలా చూసుకున్న జనసేనలోకి ఎంఎల్ఏలు చేరుతారని అనుకుంటే అందులో టిడిపి ఎంఎల్ఏలకే అవకాశం ఎక్కువుంది. టిడిపి సిట్టింగుల్లో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అవకాశం ఇవ్వరనే ప్రచారం బాగా జరుగుతోంది. కాబట్టి టిక్కెట్టు రాదనే అనుమానం ఉన్న ఎంఎల్ఏల్లో ఎవరైనా జనసేనలో చేరేందుకు అవకాశం ఉంది.