అవుననే అనిపిస్తోంది. రాష్ట్రంలో జనాలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని ఎంత వరకూ నెరవేర్చారు అన్న విషయాలను ఇపుడు ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో విడుదల చేసిన మ్యానిఫెస్టోనే టిడిపి తన పార్టీ అఫీషియల్ వెబ్ సైట్ నుండి తీసేసిందంటేనే అర్ధమవుతోంది చంద్రబాబు హామీలను ఎంత బాగా నెరవేర్చారో.
ఆదాయం పెంచుతానని అప్పులు పెంచుతున్నారు
ఇపుడు ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు పెంచుతానన్న ఆదాయం గురించే. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా ప్రతీ ఒక్కరి తలసరి ఆదాయం పెంచుతానని హామీ ఇచ్చారు. మిగిలిన హామీల సంగతి ఎలాగున్నా ఈ ఒక్క హామీనే జనాలపై కొండంత భరువును మోపే అవకాశం ఉంది. ఎలాగంటే మిగిలిన హామీలు చంద్రబాబు అమలు చేయకపోతే అది ఆయనకే నష్టం. అదే తలసరి ఆదాయం పెంచుతానని కూడా పెంచకపోతే అది ప్రత్యక్షంగా జనాలపైనే పడుతోంది.
రూ. లక్ష కోట్ల అప్పులా
తలసరి ఆదాయాన్ని పెంచుతానని హామీని ఇచ్చిన చంద్రబాబు ఆపని చేయకపోగా జనాల నెత్తిన భారాన్ని మోపుతున్నారు. గడచిన నాలుగేళ్ళల్లో కారణాలేవైనా కానీ చంద్రబాబు సుమారు రూ. లక్షల కోట్ల అప్పులు చేశారట. ఆ అప్పులు ఎవరు తీర్చాలి మళ్ళీ జనాలే కదా అభివృద్ధి పేరుతో ఇపుడు చంద్రబాబు చేస్తున్న అప్పులను రేపు తీర్చాల్సిందే జనాలే. ఎందుకంటే అధికవడ్డీలకు చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసేస్తున్నారు. అసలుతో పాటు అధికవడ్డీలను పన్నులను భరించాల్సింది కూడా జనాలే.
అభివృద్ధి అంటే అప్పులేనా
చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అంటే అధిక వడ్డీలకు అప్పులు చేయటం లాగే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్దిష్టమైన అభివృద్ధి అన్నదే కనబడలేదు. చంద్రబాబు సిఎం కాగానే మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు కానీ లేదా ఫినిషింగ్ దశలో ఉన్న ప్రాజెక్టు కానీ ఒక్కటి కూడా కనిపించటంలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలైన ప్రాజెక్టులే. అమలవుతున్న ఇతర ప్రాజెక్టుల్లో అత్యధికం జనాకర్షక ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టుల అమలుకు కూడా అప్పులతోనే నడుస్తున్నట్లున్నాయి.
అప్పులకు తోడు దుబారా కూడానా
ఇక భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే అందరిలోనూ ఆందోళన పెరిగిపోతోంది. అప్పుల్తో మొదలైన రాష్ట్రాన్ని జాగ్రత్తగా నడపాల్సిన వ్యక్తి ఇంత అనాలోచితంగా అప్పులు చేయటంతో పాటు వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ప్రతీ ఒక్కరి తలసరి ఆదాయాన్ని పెంచుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి ప్రతి ఒక్కరి తలపైనా అప్పులను పెంచుతున్నారు.