విడదల రజనీకుమారి, ఇప్పుడు గుంటూర్ జిల్లా, చిలకలూరిపేటలో ఒక సంచలనం. కారణం ఆమె ఎకాయకీ ఒక మంత్రి, అదీ పవర్ఫుల్ మంత్రినే చాలంజ్ చేసింది. అదీ గుంటూర్ - చిలకలూరిపేట లో అత్యధికులున్న సామాజిక వర్గానికి చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. అధికార తెలుగుదేశాన్ని శాసిస్తున్న సామాజిక వర్గమది.
అయితే, ఇప్పుడీ పంతం పట్టిన విడదల రజనీకుమారి అనే ఈ ఎన్నారై మహిళ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపిలో చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఈ నెల 24వ తేదీన జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. “వీఆర్ ఫౌండేషన్ ట్రష్ట్" ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ చిలకలూరిపేట ప్రజలకు పరిచయమై, వారికి బాగా దగ్గరయ్యారు.
ఆ క్రమంలోనే “చంద్రబాబు అంటే తనకెంతో అభిమానం” అని చెప్పి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పత్తిపాటి పుల్లారావు ఆమె సేవల ను రాజకీయంగా ఉపయోగించుకోవచ్చని అనుకున్నారు. అక్కడే ఆయన పప్పులో కాలేశారు.
పత్తిపాటికి పుల్లారావుకు షాకిస్తూ తాను వచ్చే 2019ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఖర్చు అంతా తానే భరిస్తానని ఆమె టీడిపి అగ్రనాయకత్వానికి చెప్పుకున్నారట. అయితే, ప్రత్తిపాటి పుల్లారావుని కాదని పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపి అధిష్టానం తేల్చిచెప్పినట్లు సమాచారం. దాంతో మండిపోయిన ఆ ఆధునిక మగువ మాంచాలి ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తానని శపథం చేశారు. ఇక తనను పార్టీకి పరిచయం చేసిన పుల్లారావుకే రజనీకుమారి రాజకీయ ప్రత్యర్థిగా మారడం, ఆయన్ను ఓడించి తీరుతానని వైసిపిలో చేరడానికి ప్రయత్నించారు. ఆ విషయం జగన్ దగ్గర చెప్పడం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, అక్కడ కూడా మర్రి రాజశేఖర్ ను కాదని ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
అయితే, అనూహ్యంగా ఆమె విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహనరెడ్డి సమక్షంలో ఈ నెల 24వ తేదీన వైసిపిలో చేరారు. ఆమెకు టికెట్ ఇవ్వడానికి జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావును ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పంతం నెగ్గించుకోవడానికే ఆమె వైసిపిలో చేరినట్లు మరి కొందరు చెబుతున్నారు.
మర్రి రాజశేఖర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, దాంతో ఆయన పోటీ చేసే స్థితిలో లేనట్లు చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ భార్యకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వైసిపి సభ్యులు కోరుతున్నందున - జగన్ నుంచి పార్టీ టిక్కెట్ కు సంబంధించి ఏ విధమైన హామీ రాలేదని అంటున్నారు. అయినా ఆమెకు చిలకలూరిపేట వైసిపి టికెట్ దక్కే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు. మున్ముందు ఏంజరగనుందో ఎవరు చెప్పగలదు. అసలే ఈ మగువ మాంచాలి చేసింది శపధం ఆషామాషీ కాదు కదా!