తెలంగాణలో గత కొంత కాలంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు ఎప్పడొచ్చినా తమ పార్టీ సిద్దంగా ఉందని..తెలంగాణ ప్రజలు తమ అధికారానికి మద్దతు ఇస్తున్నారు..మరోసారి తమదే గెలుపు ఖాయం అని అంటున్నారు సీఎం కేసీఆర్. ఇదిలా ఉంటే కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిన్న సాయం త్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ ముగిసింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో ముఖ్యంగా 14 అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి మరోసారి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.
జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజనతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించినట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరు చేయాలని కోరినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ తన నివాసానికి వెళ్లిపోయారు.