రాజకీయాలలో గుండె జల్లుమనే సీన్లు తరచూ వస్తూంటాయి. ఇక ఎన్నికల సీజన్లో అవి మరీ ఎక్కువగానే తగులుతాయి. నాలుగేళ్ళు అణిగీ మణిగీ ఉన్న నాయకులు ఎన్నికల ఏడాదిలో తమ సత్త చూపిస్తారు. అపుడు వారు ఎక్కడకు జంప్ చేస్తారో అని కలవరపడడం పార్టీల వంతు. గాలి ఎటు వీస్తే అటు మళ్ళిపోయే వారిని ఎవరూ ఆపలేరు కూడా...
వాళ్ళంతా ఇటువైపేనా :
ఏపీలో త్వరలో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఢంకా భజాయిస్తున్నారు. అది కనుక జరిగితే అధికార తెలుగుదేశం పేక మేడలా కూలిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారంటూ బాంబు పేల్ఛారు.
ఎవరు వారు :
వారి వివరాలు సరైన టైంలో చెబుతానన్న విజయసాయి టీడీపీ మునిగే పడవ అన్నారు. ఏపీలో ఇపుడు వైసీపీకి అనుకూలంగా బలమైన గాలి వీస్తోందని చెప్పుకొచ్చారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం తండోప తండాలుగా వస్తున్నారాని అంటున్నారు. జగన్ ని సీఎం చేసుకోవాలన్నది జనం కోరిక మాత్రమే కాదు. అందరిదీ అన్నారు. జగన్ పాదయాత్రకు పోటెత్తుతున్న జన సంద్రం కంటే వేరే సర్వే అవసరం లేదన్న ఆయన టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్ని సెటైర్లు వేశారు.
మేధావులు ఇటు వైపే:
ఏపీలో మేధావులు, తతస్థులు కూడా ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. మాజీ డీజీపీ సాంబశివరావు తమ పార్టీలో చేరనున్నారని చెప్పిన ఆయన మరింతమంది మేధవులు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉండగా విశాఖ వేదికగా విజయసాయి పేల్చిన బాబు టీడీపీలో చిచ్చు రాజేస్తోంది. కీలక నేతలు ఎవరు పార్టీని వదిలిపెడతారు అన్న ఆలోచనలు అక్కడ సాగుతున్నాయి.