వైసీపీ, టీడీపీలు బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పుంజుకుంటుందా? దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? మరో నాలుగైదు మాసాల్లోనే ఓ క్లారిటీ రావడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు జిల్లాకు చెందిన విశ్లేషకులు. నిజానికి ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ప్రజారాజ్యం దెబ్బకు భయపడి ఎవరూ కూడా పెద్దతలకాయలు జనసేనలోకి చేరి.. పవన్ పంచన కూర్చోలేదు. ఏమో రేపు ఈయన కూడా చిరంజీవి మాదిరిగా జెండా పీకేస్తే.. మా పరిస్థితి ఏంటని అందరూ అనుకుంటున్నారు. అయితే, జనసేనాని కాపు వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు కొందరు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు.
ఫలితంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపు నాయకులు జనసేనకు కాపు కాచేందుకు రెడీ అయ్యారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ప్రకాశంలోనూ కొందరు నాయకులు జనసేనకు మద్దతు పలికేందుకు రెడీఅయ్యారని అంటున్నా రు విశ్లేషకులు. వీరిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం ఉన్నారని చెబుతున్నారు. అదేవిధంగా పలువురు ఆశావహులు, తటస్థులు సైతం ముందుకు ఉరుకుతున్నారని, జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని చెబుతున్నారు. వీరిలో టీడీపీతో పాటు ఇటు వైసీపీ అభ్యర్థులకు షాకిస్తూ గత ఎన్నికల్లో సింగిల్గా విజయం సాధించి.. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. పేరు ఈ జాబితాలో టాప్ ప్లేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. గడచిన ఎన్నికల సమయాన్ని మినహాయిస్తే... టీడీపీకి ఆమంచి బలమైన నేతగానే వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ ఆమంచికే చీరాల టికెట్ ఇచ్చేప్రతిపాదన ఉంది. ఆమంచి విజయం సాధించేస్తారని కూడా ఆ పార్టీ వర్గాలు గట్టి ధీమాగానే ఉన్నాయి. అయితే, ఇంటర్నల్ పాలిటిక్స్తో ఆమంచి ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఆయన టీడీపీకి నమస్కారం పెడుతున్నారని అంటున్నారు. ఇక ఈ జాబితాలో ఆమంచితో పాటు ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు(గిద్దలూరు) - మాదిశెట్టి వేణుగోపాల్(దర్శి) - కాశీనాథ్ (మార్కాపురం)లతో పాటు కనకారావు - షేక్ రియాజ్ లు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వీరిలో అన్నా రాంబాబు వైసీపీలోకి వెళ్లి టికెట్ సంపాయించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏదేమైనా ఎన్నికల వేళలో ఏపీలో మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.