పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ లతో కలిసి పోరాడతానని చెప్పాడు. ఇప్పటికే కమ్యూనిస్టులు కూడా పవన్ తో కలిసి కూటమి ఏర్పాటు చేస్తామని ఇప్పటికే డబ్బా కొట్టుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. రోజులు గడిచే కొద్దీ.. వారిని తాను వాడుకుంటున్నాడో, తనను వారు వాడుకుంటున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్ కు కాస్త మెలకువ వచ్చినట్లుంది. ఇప్పుడు దాదాపుగా వారిని పక్కన పెట్టేశారు. ఎంతగా అంటే.. స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జనసేన కార్యాలయానికి వస్తే.. కనీసం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా ఆయనకు దొరకలేదు.
జనసేన పార్టీకి ఇవాళ్టి వరకూ క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేదన్న మాట వాస్తవం. పవన్ కల్యాణ్ ఎన్ని రకాలుగా బుకాయించడానికి ప్రయత్నించినా.. ఆ లోపం సులువుగా వదిలేది కాదు. కాకపోతే.. వామపక్షాలకు ఆ రకంగా ఉన్న బలాన్ని వాడుకోవాలని పవన్ తొలుత భావించారు. వారికి ఎటూ సొంతంగా గెలిచే దిక్కులేదు కాబట్టి.. కొన్ని సీట్లు ఇస్తే మిగిలిన అన్నిచోట్లా తనకు బలంగా ఉంటారని ఆయన భావించారు.
అయితే కాలక్రమంలో మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీనే రంగంలోకి దించాలనే ఆశ పవన్ కల్యాణ్ లో మొదలైంది. అప్పటినుంచి ఆయన వామపక్షాలను పట్టించుకోవడం మానేశారు. గతంలో ఆరెండు పార్టీల నేతలతో తరచూ భేటీలు, సమావేశాలు నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు వారికి దరికి రానివ్వడంలేదు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు కలిసి మహా కూటమిగా పోటీచేస్తాయంటూ.. ఆ పార్టీల నాయకులు పలుమార్లు ప్రకటించి.. జనసేన నుంచి ఎలాంటి కనీస స్పందన లేకపోగా అభాసు పాలయ్యారు.