వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిజిపి సాంబశివరావు కలవటం తెలుగుదేశంపార్టీలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ తో సాంబశివరావు భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అర్ధగంట సేపు వీరిద్దరి భేటీ సాగింది. దాంతో టిడిపి నేతల్లో ఈ విషయంపైనే పెద్ద చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే, మాజీ డిజిపి ఎట్టి పరిస్ధితుల్లోనూ వైసిపి నేతలను కలవకూడదు.
వైసిపి అంటేనే మండిపడేవారు
ఎందుకంటే, డిజిపిగా ఉన్నంత కాలం చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. చాలా సందర్భాల్లో వైసిపి నేతలను లక్ష్యంగా చేసుకునే సాంబశివరావు పనిచేశారు. తెరవెనుక ఎవరు ఆదేశాలిచ్చినా అందరికీ కనబడింది మాత్రం ఈ మాజీ డిజిపినే. అందుకనే సాంబశివరావుపై వైసిపి నేతలు ఆరోపణలు, విమర్శలతో పదే పదే దండెత్తారు. అంటే జగన్ కు సాంబశివరావుకు మధ్య వ్యక్తిగత శతృత్వముందా అన్నట్లుగా సాగింది డిజిపి పదవీ కాలం.
జగన్ తో భేటీ మామూలు విషయం కాదు
అటువంటిది ఉద్యోగ విరమణ తర్వాత ఇపుడు హటాత్తుగా జగన్ తో భేటీ అవ్వటమంటే మామూలు విషయం కాదు. ఇపుడు కూడా విశాఖపట్నం బేస్ గా ఉన్న ఓ ప్రైవేటు పోర్టుకు సిఈవోగా ఉన్న సాంబశివరావు మర్యాదపూర్వకంగా జగన్ ను కలిసినట్లు చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు. టిడిపి వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబుపై మాజీ డిజిపి బాగా మండిపోతున్నారట. జేవి రాముడు తర్వాత డిజిపి అయిన తనను చాలా కాలంపాటు ఇన్చార్జి డిజిపిగానే చంద్రబాబు ఉంచిన విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబుపై కోపం
తనను పూర్తిస్ధాయి డిజిపిగా నియమించమని సాంబశివరావు ఎంతగా రిక్వెస్ట్ చేసుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. అయితే ఉద్యోగ విరమణకు ఇంకో మూడు నెలలుందనగా పూర్తిస్ధాయి డిజిపిగా పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో తునిలో రైలు దహనం కేసు,రాజధాని ప్రాంతంలో పంట పొలాలు తగలబడటం లాంటి అనేక కేసుల్లో చాలా మంది కాపు నేలతపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అవన్నీ తెరవెనుక నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే మాజీ డిజిపి నడుచుకోవాల్సొంచ్చింది. స్వతహాగా కాపు సామాజికవర్గానికి చెందిన సాంబశివరాతోనే ప్రభుత్వం కాపులపై కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించింది. ఇటువంటి అనేక చర్యల వల్ల కాపుల్లో సాంబశివరావపై ఆగ్రహం వ్యక్తమైంది అప్పట్లో.
ఒంగోలు ఎంఎల్ఏనా లేకపోతే ఎంపినా ?
డిజిపిగా ఉద్యోగ విరమణ తర్వాత ఏదో పోర్టుకు సీఈవోగా నియమించిన తర్వాత సాంబశివరావును చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఈ మాజీ డిజిపి జగన్ ను కలిశారు. ఏదో మర్యాదపూర్వక భేటీ అంటున్న విషయాన్ని ఎవరూ నమ్మటం లేదు. వచ్చే ఎన్నికల్లో సాంబశివరావు ఒంగోలు ఎంఎల్ఏ లేదా ఎంపిగా వైసిపి తరపున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. తొందరలోనే ఈ మాజీ డిజిపి వైసిపి కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.