తెలుగుదేశంపార్టీ పోకడలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకని ఇప్పటికే చంద్రబాబు విపరీతమైన ప్రచారం చేయించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వంపై పోరాటం పేరుతో చేస్తున్న ధర్మపోరాటాలు, నవ నిర్మాణదీక్షలు ఇందులో భాగమే. పేరుకు కేంద్రంపై పోరాటం. కానీ జరుగుతున్నదంతా చంద్రబాబు, తెలుగుదేశంపార్టీకి ప్రచారమన్న విషయం అందిరికీ తెలిసిందే. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఢిల్లీలోకానీ ఏపిలో కానీ టిడిపికి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.
హోరెత్తనున్న ప్రచారం
ఇపుడు జరుగుతున్న ప్రచారమే ఎక్కువైపోయిందని జనాలందరూ అనుకుంటుంటే తాజాగా భారీ ప్రచారానికి తెరలేపారు. ఈసారి తనతో పాటు కొడుకు నారా లోకేష్ కు కూడా ప్రచారంలో భాగం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం 130 షార్ట్ ఫిల్మ్స్ తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భారీ హోర్డింగులు, పోస్టర్లతో హోరెత్తించేయాలని నిర్ణయించారు. షార్ట్ ఫిల్మ్స్ ను బహుశా సినిమా థియేటర్లలో వేస్తారేమో ?
పథకాల నిధులన్నీ దారి మళ్ళుతున్నాయా ?
ఎన్నికలకు ఉన్నది ఇక తొమ్మది నెలలు మాత్రమే. ఈ తొమ్మది నెలల్లో ఎంత స్ధాయిలో ప్రచారం చేయించుకుంటే అంత ఉపయోగమని చంద్రబాబు అనుకున్నారేమో ? ఎటూ లోకేష్ సామర్ధ్యం ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ప్రచారంలో తనతో పాటు కుమారునికి కూడా స్ధానం కల్పించబోతున్నారు. ఈ ప్రచారం మొత్తం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే ముసుగులో జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఒకవైపేమో ఉపాధి హామీ పథకంలో చెల్లించాల్సిన రూ. 542 కోట్లు చెల్లించలేదు డబ్బులు లేవని. ఇప్పటికే వివిధ శాఖలకు కేటాయించిన నిధులను కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రచారానికే ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఎక్కువైతే తీపి కూడా విషంగా మారుతుందన్న విషయం చంద్రబాబబు మరచిపోయినట్లున్నారు.