బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో చంద్రబాబునాయుడు గంట మోగించారు. చంద్రబాబు ఏంటి గంట మోగించటమేంటని అనుకుంటున్నారా ? అవునండి జారీ చేసిన అమరావతి బాండ్లు లిస్టింగ్ కు రావాలంటే గంట కొట్టాల్సిందే. అందుకనే చంద్రబాబు కూడా ఈరోజు గంట కొట్టారు. రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణలో భాగంగా అమరావతి బాండ్లను జారీ చేసిన విషయం గుర్తుంది కదా ? ఆ బాండ్లను కొనుగోలు చేసిన వారు తిరిగి అమ్ముకోవాలంటే అందుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అవ్వాలి. బాండ్లు అమ్మకానికి ఇపుడు లిస్టులో ఉంచారు. ఆ కార్యక్రమాన్నే చంద్రబాబు గంటకొట్టి మరీ ప్రారంభించారు.
అధిక వడ్డీ కాబట్టే ఓవర్ సబ్ స్క్రైబ్
రూ. 1300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రభుత్వం బాండ్లను విడుదల చేస్తే అనూహ్యంగా ఒకటిన్నర రెట్లు అంటే రూ. 2 వేల కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక్కడ బాండ్లు అమ్ముడుపోయాయంటే అధిక వడ్డీలకు పెట్టుబడిదారులనుండి అప్పులు తీసుకోవటమే. బాండ్లకు అత్యధిక వడ్డీని ఇస్తామంటే ఎవరు మాత్రం అప్పులు ఇవ్వరు చెప్పండి ? అందుకే బాండ్లు రిలీజ్ చేసిన గంటలోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయి. అధిక వడ్డీలకు అప్పలు తేవటాన్ని కూడా చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవటమే ఇక్కడ విచిత్రంగా ఉంది.
నిఫ్టీ సూచిలో 11650 పాయింట్లు
రాజధాని నిర్మాణం కోసమంటూ బాండ్లను లిస్టింగ్ చేయటం దేశంలోనే ఇదే మొదటిసారి. సరే, తర్వాత స్టాక్ ఎక్స్చేంజిలోనే ఉన్న కన్వెన్షన్ హాలులో పారిశ్రామికవేత్తలతో సమావేశం కూడా అయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో బాండ్లను లిస్టింగ్ కు ఉంచాల్సిన అవసరం ఏంటనే విషయాన్ని చంద్రబాబు సమావేశంలో వివరించారు. అమరావతి బాండ్లు లిస్టింగ్ అయిన వెంటనే నిఫ్టి సూచీలో రికార్డు స్ధాయిలో 11650 పాయింట్లను టచ్ చేయటం కూడా ఒక రికార్డేనట.