మెల్లి మెల్లిగా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పార్టీలో గొంతులు లేస్తున్నాయి. ఒకపుడు తెలుగుదేశంపార్టీ విధానలకు విరుద్దంగా బహిరంగంగా మాట్లాడేందుకు నేతలు భయపడేవారు. అటువంటిది ఇపుడు చంద్రబాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఏకంగా చంద్రబాబునే తప్పుపడుతున్నారు. అదే ఇపుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. నేతలు అలా మాట్లాడుతుంటే వారిపై చర్యలు తీసుకోలేరు. అలాగని వారు మాట్లాడుతుంటే వారిని వదిలేయలేరు.
పొత్తులపై మొదలైన రచ్చ
ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయ్. ఇంకోవైపు పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. నేతల మధ్య కుమ్ములాటలు ఏదో ఒక జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. సుమారు 9 జిల్లాలో నేతల మధ్య వివాదాలు తారస్ధాయికి చేరుకున్నాయి. ఇదంతా ఇపుడెందుకంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో టిడిపిలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తుల విషయాన్ని చంద్రబాబు పార్టీలో చర్చకు పెట్టారో సీనియర్ మంత్రులైన కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎదురుతిరిగారు.
చంద్రబాబుకు షాకిచ్చిన మంత్రులు
మంత్రులిద్దరూ చంద్రబాబు నిర్ణయానికి మామూలుగా ఎదురుతిరగటం కాదు. మంత్రుల కామెంట్లకు చంద్రబాబే షాకైపోయారు. కాంగ్రెస్ తో పొత్తంటే జనాలు టిడిపి నేతలను బట్టలూడదీసి కొడతారని చింతకాయల చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కెఇ మాట్లాడుతూ, కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకించటం తన ఒక్కడి ఆలోచనే కాదని చాలా మంది నేతలు తనకు మద్దతుగా నిలబడుతున్నట్లు చెప్పారు. దాంతో ఇద్దరు మంత్రుల మాటలను చంద్రబాబు అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.
జేసి సోదరులతో మొదలైంది
చంద్రబాబు ఆలోచనలను, నిర్ణయాలను బహిరంగంగా తప్పుపట్టటమన్నది మంత్రులతో మొదలుకాలేదు. అనంతపురం జిల్లాలో జెసి సోదరులు ఎప్పటి నుండో ఇదే పని చేస్తున్నారు. తమకు నచ్చని చంద్రబాబు ఆలోచనలపైనే కాదు నిర్ణయాలపైన కూడా జెసి సోదరులు బాహాటంగానే మాట్లాడేస్తున్నారు. వారి వ్యాఖ్యల వల్ల అనంతపురం జిల్లాలో పెద్ద రచ్చే అవుతోంది.అయినా వారిని చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎంఎల్సీ కరణం బలరామ్ కూడా అదే పద్దతి. బహిరంగంగానే చంద్రబాబును తప్పు పడుతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డిది కూడా అదే పద్దతి.
ఎన్నికల టెన్షన్ లో సిఎం
ఇటువంటి నేతలకు మంత్రులిద్దరూ తాజాగా తోడయ్యారు. అంటే లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు. దాంతో వారి వ్యాఖ్యలపైనే పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. ఇటువంటి నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. చర్యలు తీసుకుంటే ఒక సమస్య , తీసుకోకపోతే మరో సమస్య. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో వీరిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా దాని ప్రభావం పార్టీపై ఎక్కడ ప్రభావం చూపుతుందన్నదే సమస్య. అలాగని వారిపై చర్యలు తీసుకోకపోతే దాన్ని అలుసుగా తీసుకుని మరింత మంది రెచ్చిపోతే అది పార్టీలో అరాచకానికి దారితీస్తుందనే ఆందోళనలో చంద్రబాబున్నారు. మొత్తం మీద చంద్రబాబు పరిస్ధితి విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం లాగ తయారైంది.