తెలుగుదేశంపార్టీ సీనియర్ మంత్రులు దరిద్రమని అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నెత్తిన పెట్టుకోవటానికి చంద్రబాబునాయుడు సిద్ధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవటం ద్వారా దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవటానికి చంద్రబాబు ఎందుకు సిద్దపడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. కాంగ్రెస్ తో పొత్తును ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి దరిద్రమని వర్ణించిన సంగతి అందరికీ తెలిసిందే. కెఇ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుండి ఎటువంటి స్పందనా రాకపోయినా కెఇ వ్యాఖల్యను టిడిపిలోని కొందరు నేతలు తప్పు పట్టటం ఆశ్చర్యంగా ఉంది.
చర్చల్లోనే మొదలైన చిచ్చు
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు దాదాపు నిర్ణయించేశారు. కాకపోతే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదంతే. కాంగ్రెస్ తో పొత్తు విషయంపై నేతల మైండ్ సెట్ చేయాలని పొత్తుల విషయంపై పార్టీలో చర్చకు పెట్టారు. దాంతోనే చిచ్చు మొదలైంది. సీనియర్ మంత్రులు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు చంద్రబాబు ఆలోచనపై చాలా తీవ్రంగానే రియాక్టయ్యారు. మంత్రుల నుండే అటువంటి రియాక్షన్ను ఊహించని చంద్రబాబుకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది.
తెలంగాణాకు మాత్రమే పరిమితమా ?
దాంతో రిపేర్ సర్వీసుకు దిగారు. కెఇని, చింతకాయలపై మండిపడినట్లుగా మీడియాలో లీకులిప్పించుకున్నా అంతర్గతంగా మాత్రం బుజ్జగింపులు మొదలుపెట్టారట. కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణాకు మాత్రమే పరిమితం చేస్తే ఎలాగుంటుందని చంద్రబాబు తాజాగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. సరే, పొత్తు రెండు రాష్ట్రాల్లోనూ పెట్టుకున్నా లేకపోతే తెలంగాణాలో మాత్రమే ఉన్నా దరిద్రం దరిద్రమే కదా ? తెలంగాణాలో మాత్రమే పొత్తని చంద్రబాబంటే అప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.