ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం లో స్పీడ్ పెంచుతుంది . ఇప్పటికే నియోజక వర్గం వారీగా జగన్ అభ్యర్థులను ఎంపిక పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. అయితే గుంటూరు లో అసలైన సమస్య ఏర్పడింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలుకలూరి పేటను వచ్చే ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్న ఆ పార్టీ అధినేత జగన్, తాజాగా నియోజకవర్గానికి చెందిన కీలక నేత, ఎన్నారై అయిన విడుదల రజనీ కుమారిని పార్టీలో చేర్చుకున్నాడు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని, టికెట్ తనకు ఇస్తే చిలుకలూరి పేటలో వైసీపీని అలవోకగా గెలుపించుకుంటానని ఆమె చెప్పటంతో, జగన్ కూడా ఆమెకే టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీఆర్ ఫౌండేషన్ పేరిట ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు పార్టీ గెలుపుకు దోహదపడతాయని భావించిన జగన్, పార్టీలో చేరిన వెంటనే రజనీకుమారిని నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్ గా నియమించడంతో, ఇక చిలుకలూరి పేట టికెట్ ఆమెదేనని దాదాపుగా ఖరారైంది.
దీంతో, ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ గా ఉన్న మర్రి రాజశేఖర్ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేసిన మా నాయకుడికి కాకుండా, కొత్తగా పార్టీలో చేరిన రజనీకుమారికి ఏ విధంగా కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తారని మండిపడుతున్నారు. అంతేకాదు, రజినీకుమారికి కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారని తెలిసిన వెంటనే మర్రి రాజశేఖర్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.