హై కోర్టు ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే విషయంలో పెద్ద గందరగోళమే మొదలైంది. తెలుగు ప్రభుత్వాల వాదనకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా వేసిన పిటీషనే గందరగోళానికి కారణమైంది. హైదరాబాద్ లోనే ఏపి హై కోర్టు ఉండాలంటూ కేంద్రప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేయటంతో తెలుగు ప్రభుత్వాలకు షాక్ కొట్టింది. నిజానికి విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లోని హై కోర్టే ఉమ్మడి హై కోర్టుగా ఉంటుంది. సచివాలయం తదితరాలు కూడా పదేళ్ళ పాటు ఉండాలి. కానీ చంద్రబాబునాయుడు చేసిన పనికిమాలిన పని వల్ల ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే హైదరాబాద్ పై నైతికంగా హక్కులు కోల్పోయారు. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసుల నుండి తప్పించుకునేందుకు హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా విజయవాడకు పారిపోయారు. దాంతో విభజన చట్టానికి తూట్లు పడింది.
నైతిక హక్కు కోల్పోయిన చంద్రబాబు
చంద్రబాబు ఎప్పుడైతే హైదరాబాద్ మీద నైతికంగా హక్కును కోల్పోయారో వెంటనే హై కోర్టు మీద అందరి దృష్టి మళ్ళింది. అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి. ఉమ్మడి హై కోర్టులో ఏపి జడ్జిలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తీర్పులన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా వస్తున్నాయనే ప్రచారాన్ని తెలంగాణా న్యాయవాదులు తెరపైకి తెచ్చారు. దాంతో ఆ తర్వాత జరిగిన గొడవలన్నీ అందరికీ తెలిసిందే. దాంతో వేరే గత్యంతరం లేక ఏపికి ప్రత్యేకంగా హై కోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ఏపి ప్రభుత్వం వచ్చింది. అమరావతి ప్రాంతంలో అందుకు అవసరమైన స్దలం కూడా చూస్తున్నారు.
కేంద్రం పిటీషన్ ను సుప్రిం ఆమోదిస్తుందా ?
ఇంతలో తెరవెనుక ఏం జరిగిందో ఏమో కేంద్రం తాజాగా సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ వేయటం ఆశ్చర్యంగా ఉంది. అమరావతిలో హై కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే కేంద్రమేమో హైదరాబాద్ లోనే ఏపి హైకోర్టు ఏర్పాటు చేయాలని పిటీషన్ వేసింది. కేంద్రం పిటీషన్ ను గనుక సుప్రింకోర్టు ఆమోదిస్తే తెలుగు ప్రభుత్వాలకు షాక్ కొట్టినట్లే.