ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆయనకు తలనొప్పిగా పరిణమించా యి. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం, ఎవరు ఓడినా ఆ ప్రభావం.. ప్రభుత్వ ఏర్పాటుపై పడడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 5% ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటై నాలుగున్నరేళ్లు గడిచిన తర్వాత ఆయన మైనార్టీ శాఖ ఏర్పాటు.. మంత్రిని కేటాయించడం వంటి విషయాలపై దృష్టి పెట్టారనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి.
దీనికి ఈ రోజు గుంటూరులో జరగనున్న నారా హమారా-టీడీపీ హమారా! సభలో శ్రీకారం చుట్టనున్నారని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మైనార్టీ వర్గం వారు ఎవరూ కూడా విజయం సాధించలేదు. మైనార్టీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ జెండానే ఎగిరింది. గత దశాబ్దంన్నర కాలంగా మైనార్టీల్లో మెజార్టీ వర్గాలు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ వైపే ఉన్నాయి. ఈ క్రమంలోనే మైనార్టీల సానుకూలత కోసం బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోననే ఎన్ ఎం.డీ ఫరూక్ను శాసన మండలికి ప్రమోట్ చేసి ఆయనను చైర్మన్ ను కూడా చేశారు.
ఇక, ఆ తర్వాత మైనార్టీ శాఖను ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ శాకను ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. క్రమంలో విజయవాడ పశ్చిమ నియోకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ను కడప నుంచి వైసీపీ జెండాపై గెలిచిన అంజాద్ బాషాలను తన సైకిల్ ఎక్కించుకున్నారు చంద్రబాబు. వీరిలో ఒకరికి మైనార్టీ మంత్రి పదవి ఇవ్వాలని భావించారు. అయితే, జలీల్ ఖాన్ తన స్వీయ తప్పిదంతో ఈ పదవిని పోగొట్టుకున్నారు. ఇక, అప్పటి నుంచి చంద్రబాబు ఈ మంత్రి పదవిని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంతలో సొంత పార్టీ మైనార్టీ వర్గానికిచెందిన వారికే పదవి ఇవ్వాలనే డిమాండ్ అంతర్గతంగా వినిపించింది.
దీంతో చంద్రబాబు ఎన్ ఎండీ ఫరూక్తోపాటు షరీఫ్ పేర్లను కూడా పరిశీలించారు.వీరిద్దరిలో ఎవరికైనా ఓకే అని సీనియర్లు సూచించారు. దీంతో మైనార్టీ శాఖ ఏర్పాటు చేయాలని బాబు భావించారు. అయితే, ఈ ముహూర్తం సమీపించే సరికి .. ఇప్పుడు ఫరూక్ పేరుకే ప్రాధాన్యం వస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్కు ఇవ్వడం ద్వారా అక్కడి మైనార్టీ ఓట్లు సహా వివాద రహితునిగా ఉన్నందున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తారని అంటున్నారు. దీంతో ఇప్పుడు షరీఫ్ పేరు తెరమరుగైనట్టు సమాచారం. దీంతో ఆయన వర్గం అలకబూనినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా.. గుంటూరులో జరగనున్న సభలో దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు పార్టీ సీనియర్లు!!