ఏ విషయంలో అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి తాజాగా చంద్రబాబునాయుడుపై పెద్ద బండే వేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగముందన్నారు. విభజన పాపాన్ని చంద్రబాబు మొన్నటి వరకూ కాంగ్రెస్ పైనా ఇపుడేమో బిజెపి పైనా వేసేస్తున్నారు. జేసి ఏమో చంద్రబాబుకు భిన్నంగా టిడిపికి కూడా వాటా ఉందంటూ వ్యాఖ్యానించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.
అవసరానికి తగ్గట్లు మాట్లాడుతున్న చంద్రబాబు
నిజానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో బిజెపి, తెలుగుదేశంపార్టీలకు కూడా అంతే భాగముందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అప్పట్లో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, ఎవరో ఒకరికి ఓట్లేయాలి కాబట్టి టిడిపి-బిజెపి పార్టీలకు వేశారంతే. ఏదో నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ రూపంలో అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చేసిన చంద్రబాబు అప్పటి నుండి విభజన పాపాన్ని కాంగ్రెస్ కు అంటకట్టని రోజంటూ లేదు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండి అదే పాపాన్ని బిజెపి నెత్తిన కూడా పెడుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుండి విభజనలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న విషయాన్ని కూడా ప్రస్తావించటం లేదు.
దుమారం రేపుతున్న జేసి వ్యాఖ్యలు
ఇటువంటి పరిస్దితుల్లో విభజన పాపంలో టిడిపికి కూడా భాగముందంటూ జేసి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. అదే సమయంలో పొత్తుల గురించి కూడా మాట్లాడారు. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పర్వాలేదట. అయితే, ఏపిలో మాత్రం అవసరం లేదనే చంద్రబాబు ఆలోచనను మీడియా ముందుంచారు. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్దితిలో టిడిపి లేదు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు ఓకేనట. మరి, ఏపిలో కాంగ్రెస్ పరిస్దితి అంతే కదా ? అందుకనే ఏపిలో టిడిపితో పొత్తుండాల్సిందే అని కాంగ్రెస్ నేతలంటే చంద్రబాబు అపుడేం చేస్తారు ?