రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అందులోనూ తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్ధులను ఇరుకున పెట్టేందుకు ఇద్దరు కూడా ఎవరి కసరత్తులు వాళ్ళు చేస్తున్నారు.
సెప్టెంబర్ 3వ తేదీ కీలక సమావేశం
ఇదంతా ఇపుడెందుకంటే, వచ్చే నెల 3వ తేదీన జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మాజీ ఎంపిలతో పాటు కీలక నేతలు కూడా హాజరుకావాలంటూ పార్టీ కార్యాలయం అందరికీ సమాచారం ఇచ్చింది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులు, ముందస్తు ఎన్నికల ప్రచారం, ఢిల్లీలో శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలతో పాటు ఎంఎల్ఏ, ఎంఎల్సీల రాజీనామా అంశం కూడా చర్చకు వస్తుదని సమాచారం.
రాజీనామాల అంశమే కీలకం
పైన చెప్పుకున్న అన్నీ అంశాల్లోకి ఎంఎల్ఏలు, ఎంఎల్సీల రాజీనామా అంశమే చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే, ప్రత్యేకహోదా డిమాండ్ తో ఎంపిలు ఐదుమంది రాజీనామాలు చేసినపుడే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా రాజీనామాలు చేస్తారనే చర్చ పార్టీలో బాగా జరిగింది. అప్పట్లో ఒంగోలులో పాదయాత్రలో ఉన్న జగన్ తో పలువురు ఎంల్ఏలు రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు కూడా. కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆ విషయం మరుగునపడిపోయింది.
పెరిగిపోతున్న ఎన్నికల వేడి
మళ్ళీ ఇంతకాలానికి ఎంఎల్ఏ, ఎంఎల్సీల రాజీనామా అంశం పార్టీలో చర్చకు వస్తోంది. ఎటూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరిగిపోయింది. కాబట్టి ఈ సమయంలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు గనుక రాజీనామాలు చేస్తే రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించవచ్చని వైసిపి నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ పాదయాత్రలో విరుచుకుపడుతున్నారు. పాదయాత్రకు జన స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది.
ఇరకాటంలో పెట్టటమే లక్ష్యమా ?
మరో రెండు నెలల్లో పాదయాత్ర పూర్తయిపోతోంది. తర్వాత మెల్లిగ ఇపుడు టచ్ చేయని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర మొదలవుతుంది. కాబట్టి ఈ మధ్యలో రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందనే చర్చ ఊపందుకుంటోంది. ఒకవేళ రాజీనామాలకు జగన్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తక్షణమే రాజీనామాలు చేయటానికి సిద్దంగా ఉన్నారు. అంటే రాజీనామాల ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్నది వైసిపి వ్యూహంగా కనబడుతోంది. అందుకే సెప్టెంబర్ 3వ తేదీ సమావేశం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.