ఆంధ్రులందరికీ అన్నగా సుపరిచితుడైన విశ్వ విఖ్యాత నటుడు, రాజకీయాల్లో సంచలనమైన నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2వ తేదీ జన్మించారు. శ్రీకృష్ణావతారం సినిమాతో బాలనడుడుగా సినీరంగ ప్రవేశం చేశారు. హరికృష్ణ సుమారుగా 35 చిత్రాల్లో నటించారు. హీరోగా, నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. దాన వీర శూర కర్ణ, తాతమ్మకల, తల్లా పెళ్లామా లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించారు.
చైతన్య రథ సారధిగా
ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశంపార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ పర్యటన కూడా చైతన్య రథం పేరుతో ఓ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుని తిరిగారు. ఆ వాహనాన్ని స్వయంగా హరికృష్ణే నడిపారు. టిడిపితో మొదలుపెట్టిన రాజకీయ జీవితం నేటి వరకూ సాగుతూనే ఉంది. హిందుపురం ఎంఎల్ఏగా, రవాణాశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా టిడిపిలో ప్రముఖ స్ధానంలోనే ఉన్నారు. ప్రస్తుతం టిడిపి పొలిట్ బ్యూరోలో సభ్యునిగా ఉన్నారు. హరికృష్ణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రెండో భార్య శాలిని. ముగ్గురు కొడుకులు జానకిరామ్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కుమార్తె సుహాసిని ఉన్నారు. మూడేళ్ళ క్రితం పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. దాంతో హరికృష్ణ బాగా డిస్ట్రబ్ అయ్యారు. దానికితోడు షుగర్ సమస్యతో హరికృష్ణ బాగా ఇబ్బంది పడుతున్నారు.
అతి వేగమే కొంపముంచిందా ?
మొదటి నుండి కూడా హరికృష్ణకు వేగంగా కార్లను నడపటమంటే చాలా ఇష్టం. నడిపే వాహనం ఏదైనా సరే వేగంగా వెళ్ళాల్సిందే. ఇపుడు ప్రమాదానికి గురైన కారు కూడా ప్రమాద సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు స్పీడో మీటర్ ప్రకారం తెలుస్తోంది. తెలిసిన వాళ్ళందరితోనూ హరికృష్ణ చాలా స్నేహపూర్వకంగా, సన్నిహితంగా ఉంటారనే పేరుంది. సెప్టెంబర్ 2వ తేదీన జన్మదిన వేడుకలు చేసుకోవద్దని అభిమానులకు హరికృష్ణ విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఎందుకంటే, రాష్ట్రంలో వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ బాధితులకు ధన సహాయం చేయాలని విజ్ఞప్తి చేసే ఉద్దేశ్యంతో ఓ లేఖ కూడా సిద్దం చేసుకున్నారు. అయితే, ఆ లేఖను విడుదల చేయకుండానే మృతి చెందారు.