నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఓ రాయిపై ఎక్కటం వల్లే అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారుకు ప్రమాదం జరగటంతో ఈరోజు తెల్లవారి నందమూరి హరికృష్ణ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరబాద్ నుండి నెల్లూరులోని ఓ ఫంక్షన్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. స్వయంగా హరికృష్ణే నడుపుతున్న ఎండీవర్ కారులో ఆయనతో పాటు మిత్రులు అరెకపూడి శివాజి, వెంకట్రావు కూడా ఉన్నారు. అయితే, మిత్రులిద్దరూ కారులో వెనుక సీటులో కూర్చుని ఉన్నారు. హరికృష్ణతో పాటు వారికి కూడా గాయాలైనప్పటికీ స్వల్ప గాయాలతో ఇద్దరూ బయటపడ్డారు.
నెల్లూరుకు వెళుతున్నాం
అదే విషయాన్ని శివాజి మాట్లాడుతూ, ఈరోజు ఉదయం 4.3 గంటల ప్రాంతంలో తాము కారులో నెల్లూరుకు బయలుదేదరినట్లు చెప్పారు. హరికృష్ణ కారు నడుపుతున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద అన్నేపర్తి వద్దకు తమ కారు చేరుకోగానే ఓ రాయిపైకి ఎక్కిందన్నారు. దాంతో వాహనం అదుపుతప్పటంతో కారు బోల్తా పడిందని శివాజి చెప్పారు. డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోలేదని, వెనుక సీట్లో కూర్చున్న తామిద్దరం సీటు బెల్టు పెట్టుకున్న కారణంగానే తాము స్వల్ప గాయాలతో బయటపడ్డామన్నారు. ప్రమాదం జరగ్గానే హరికృష్ణ ముందుంటే బాయ్ నెట్ కు గుద్దుకుని ముందుకెళ్లి పడిపోయారు.
అతివేగమే కారణం
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. మీడియాతో మాట్లాడిన శివాజీ ప్రమాద తీవ్రతను తక్కువ చేసి చూపాలని ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. శివాజీ చెప్పినట్లు నిజంగానే కారు రాయిపైకి ఎక్కితే అంతగా బోల్తా పడాల్సిన అవసరం లేదు. ఎదురుగా ఓ వాహనాన్ని ఢీ కొన్న కారు పల్టీలు కొట్టి డివైడర్ ను కూడా దాటుకుని వెళ్ళి అవతల పడిందన్న విషయం ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందులోనూ ప్రమాదం జరిగినపుడు కారులోని స్పీడో మీటర్ 120 కిలోమీటర్ల వద్ద స్ట్రక్ అయ్యుంది. అంటే ఎంత స్పీడుగా వాహనం వెళుతోందో అర్ధమైపోతోంది. మొత్తం అతి వేగమే హరికృష్ణ ప్రాణాలు తీసుకుందన్న మాట మాత్రం వాస్తవం.