విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు, తెలుగు రాజకీయాల్లో సంచలనమైన నందమూరి తారక రామారావు పై ఉన్న అభిమానాన్ని తెలంగాణా సిఎం కెసిఆర్ చాటుకున్నారు. ఈరోజు ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. గురువారం జరిగే హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరగాలని కెసిఆర్ ఆదేశించటం గమనార్హం. ప్రమాదం విషయం తెలియగానే కెసిఆర్ వెంటనే అందరినీ అప్రమత్తం చేశారు. కామినేని ఆసుపత్రిలో అత్యున్నత వైద్య సహాయం అందిచాల్సిందిగా యాజమాన్యాన్ని కోరారు. అదే సమయంలో దగ్గరుండి అవసరమైన సహాయం చేయాల్సిందిగా మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించారు.
అధికారులకు కెసిఆర్ ఆదేశాలు
హరికృష్ణ మృతి చెందారన్న సమాచారం అందగానే అంత్యక్రియలు చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చూడాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రెవిన్యూ ఉన్నతాధికారులను అందుకు పురమాయించటం కూడా అందులో భాగమే. కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలు ఎక్కడ చేసేది కనుక్కుని ఏర్పాట్లు చేయమన్నారు. మొయినాబాద్ లో ఉన్న ముర్తజాగూడ ఫాం హౌజ్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పగానే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ కెసిఆర్ ఆదేశించారు.
ఎన్టీఆర్ కు వీరాభిమాని
హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాల్సిన అవసరం లేదు నిజానికి. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం ఏ పదవిలోనూ లేరు. మాజీ ఎంపిలు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు చాలా మంది చనిపోయినా వారెవరకీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు. కానీ ఇపుడు హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని ఎందుకు ఆదేశించారంటే, ఎన్టీఆర్ పై కెసిఆర్ కున్న అభిమానం అటువంటిది. ఎన్టీఆర్ కు కెసిఆర్ వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా హరికృష్ణ రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి కూడా కావటంతో కెసిఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టేవారు కూడా లేరు.