ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో సీనియర్ టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సినీ పరిశ్రమ, రాజకీయ నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఉన్న నివాసంలో హరికృష్ణ భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించారు.
నందమూరి హరికృష్ణతో తనకు ఎంతో అనుబంధం ఉందని తన తో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు పార్టీ కోసం పరితపించే వ్యక్తి అని..ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా ఉండేవారని..ఎంతో నిడారంబరుడని..స్నేహానికి మంచి ప్రాధాన్యత ఇచ్చేవారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కూడా నివాళి అర్పించారు.
ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబుతో కేసీఆర్ కొద్ది సేపటి వరకు ముచ్చటించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహిస్తున్న విషయం గురించి వీరు మాట్లాడి ఉండవచ్చు. కేసీఆర్ తో పాటు చంద్రబాబు కూడా బయటకు వచ్చారు.