విశాఖ జిల్లా రాజకీయలకు కేంద్ర బిందువు ఆ ప్రాంతం. అక్కడ నాడి పట్టుకుంటే చాలు మొత్తం చెప్పెయ్యొచ్చు. అటువంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో జనం ఓ రేంజిలో పేటెత్తారంటే దేనికి సంకేతం. వెల్లువలా ప్రజలు తరలివచ్చారంటే ఏం చెప్పబోతున్నారు. అంత పెద్ద ఎత్తున ఒక చోటకు చేరిన జనం నీరాజనమే పడితే అది రేపటి తీర్పు అవుతుందా.. ప్రత్యర్ధులకు దడ పుట్టించేలా జగన్ అనకాపల్లి మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది.
జిల్లాను చేస్తా :
అనకాపల్లిని జిల్లాను చేస్తానని నిండు సభలో జగన్ హామీ ఇచ్చారు. ఈ రోజు అక్కడ నడిబొడ్డున జరిగిన భారీ సభకు జనం ప్రవాహంలా వచ్చారు. జగన్ కోసం వేచి ఉండి మరీ మీటింగ్ ఆసాంతం విన్నారు. ఆ ప్రాంతం ప్రజల చిరకాల వాంచకు తగినట్లుగానే జగన్ హామీ ఇచ్చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అనకాపల్లి జిల్లా అవుతుందన్నారు. దీంతో చప్పట్లతో సభా ప్రాంగణమంతా మారుమోగింది.
ఆ తీపి రుచి చూపిస్తా :
అనకాపల్లి అంటేనే బెల్లం గుర్తుకు వస్తుందని, అటువంటి చోట బెల్లం రైతులకు చేదును అందించే పాలన సాగుతోందని జగన్ ఫైర్ అయ్యారు. ఇక్కడ క్వింటాల్ చంద్రబాబు హెరిటేజ్ షాప్లో బెల్లం ధర 84 రూపాయలు. కానీ రైతులు తయారు చేసిన క్వింటాల్ బెల్లానికి 2500 నుంచి 3వేల రూపయలు కూడా పలకడం లేదు. మార్కెట్ బెల్లానికి, హెరిటేజ్ బెల్లం ధరకు చాలా తేడా ఉంది. సీఎం చంద్రబాబే దళారిగా మారితే రైతులను ఆదుకునేది ఎవరంటూ జగన్ నిలదీశారు.
బీసీలంటే చులకనా:
అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటారని, తీరా వచ్చాక పక్కన పెడతారని జగన్ సెటైర్లు వేశారు. పేదలు, బీసీలపై ప్రేమ చూపించిన ఏకైక వ్యక్తి వైఎస్సారేనని చెప్పారు. బీసీల కోసం తాను నవరత్నాలను రూపకల్పన చేశానని,అధికారంలోకి రాగానే అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. బీసీలు, పేదల చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చైనా తమ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటే మెస్ ఛార్జీల కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.