రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు.
హరికృష్ణను కడసారి చూసేందుకు వచ్చే ఏ ఒక్కరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సోదరులు తారక్, కల్యాణ్ రామ్ లతో పాటు నందమూరి కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మెహదీపట్నం ఎన్ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమ యాత్ర మొదలై సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్పేట్నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ నుంచి కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానం చేరుకుంటుంది.
హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్ఘట్, ఆసిఫ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు.