ప్రధానమంత్రి నరేంద్రమోడికి నోట్ల రద్దు వ్యవహారం పెద్ద షాకే ఇచ్చింది. గడచిన నాలుగేళ్ళల్లో మోడి తీసుకున్న అనేక అసంబద్ధమన నిర్ణయాల్లో పెద్ద నోట్లరద్దు ముందువరసలో ఉంటుంది. మోడి తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. బ్లాక్ మనీని బయటకు రప్పించటమే నోట్ల రద్దు ఉద్దేశ్యమని మోడి దేశమంతా తిరిగి చెప్పుకున్నారు. జనాలు కూడా నిజమే అనుకునే కష్టాలను, నష్టాలను భరించారు. కానీ ఇపుడు జరిగిందేంటి ? నోట్ల రద్దు జరిగిన రెండేళ్ళ తర్వాత రిజర్వ్ బ్యాంకు లెక్కలు బయటపెట్టింది. బయటపడిన లెక్కలతో మోడికి దిమ్మ తిరిగింది.
బ్యాంకులకు రాని మొత్తం రూ. 10 వేల కోట్లే
ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) లెక్కల్లో ఏం తేలింది ? ఏమి తేలిందంటే రద్దైన పెద్ద నోట్లలో 99.3 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేసిందట. అంటే బ్యాంకులకు తిరిగి వచ్చేసింది కాబట్టి వచ్చిందంతా ఇపుడు వైట్ మనీ అయిపోయినట్లే లెక్క. మోడి సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందన్న విషయం అర్ధమైపోతోంది. నోట్ల రద్దు చేసినపుడు మోడి సుమారు రూ. 5 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉందని చెప్పారు. అలాగే, కొత్తగా ముద్రించబోయే నోట్లకు నకిలీ కరెన్సీని ముద్రించటం సాధ్యం కాదన్నారు.
ఆర్ధిక వ్యవస్ధకు నష్టం రూ. 2.25 లక్షల కోట్లు
మోడి చెప్పిన ప్రకారం అప్పట్లో రూ. 15.41 లక్షల కోట్ల పెద్ద నోట్లు చెలామణిలో ఉండేది. అందులో సుమారు రూ. 5 లక్షల కోట్లు బ్లాక్ మనీగా లెక్కేశారు. కానీ ఇపుడు నికరంగా తేలిందేమంటే బ్యాంకులకు రాని పెద్ద నోట్లు రూ. 10, 727 కోట్లు మాత్రమేనట. బ్యాంకులకు రాలేదన్నంత మాత్రాన అదంతా బ్లాక్ మనీగా లెక్కేసేందుకు లేదు. పెద్ద నోట్లు రద్దై మళ్ళీ కొత్త నోట్లు రద్దు చేసేందుకు కేంద్రానికి సుమారుగా అయిన ఖర్చు రూ. 25 వేల కోట్లు. నోట్టరద్దు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్దకు జరిగిన నష్టం సుమారు రూ. 2.25 లక్షల కోట్లు. సో, ఇవన్నీ చూస్తుంటే మోడి నిర్ణయం బ్లాక్ మనీని బయటకు తీయటం, నకిలీ కరెన్సీని నియంత్రించటం కాదని అర్ధమైపోతోంది. ఎందుకంటే, ప్రకటించినంత బ్లాక్ మనీ లేదని తేలిపోయింది. నకిలీ కరెన్సీని ప్రభుత్వం నియంత్రించలేపోయింది. అంటే మోడి నోట్ల రద్దు నిర్ణయం పెద్ద ఫ్లాప్ షో అన్న విషయం అర్ధమైపోతోంది.