ఏపీ కేబినెట్ను విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్న మైనార్టీలను తనవైపు తిప్పుకొనేందుకు శతవిధాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రతి ఓటు, ప్రతి సీటు కీలకంగా మారిన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి తన రికార్డును తానే బ్రేక్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమం లోనే తాజాగా మైనార్టీ శాఖ ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు మైనార్టీ శాఖను ఏర్పాటు చేయకపోవడం, మైనార్టీ లపై చంద్రబాబుకు ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేస్తోందని ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్ పలు మా ర్లు విమర్శించారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఈ విమర్శల తాకిడి మరింతగా పెరగనుంది. దీంతో ముందుగానే అలెర్ట్ అయిన చంద్రబాబు మైనార్టీ వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు. వారికి సంబంధించిన సంక్షేమ పథకాలపై ఇప్పటికే భారీ ఎత్తున రూ.కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయినా కూడా ఎక్కడో తేడా వస్తుందని ముందుగానే భావిస్తున్న ఆయన మంత్రి వర్గంలో మైనార్టీలకు కూడా అవకాశం కల్పించడం ద్వారా తనపై వ్యతిరేకత లేకుండా, మైనార్టీ వర్గం ఓట్లు తన పార్టీకే లభించేలా పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరులో తాజాగా నిర్వహించిన నారా హమారా-టీడీపీ హమారా సభను భారీ ఎత్తున విజయవంతం చేశారు. అదే సమయంలో ఈ సభా వేదిక నుంచి మైనార్టీ శాఖను, మంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ పదవికి ఇద్దరు కీలక మైనార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఇద్దరూ సొంత పార్టీ వారే కావడం గమనార్హం. ఒకరు శాసన మండలి చైర్మన్ ఎండీ ఫరూక్ కాగా, మరొకరు మండలి సభ్యులు షరీఫ్. అయితే, వీరిలో షరీఫ్ పశ్చిమ గోదావరి కి చెందిన నేత. ఫరూక్ సీమ ప్రాంతానికి చెందిన నాయకుడు.
ఫరూక్పైనే చంద్రబాబు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సీమలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా ఫరూక్ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. ఈయనను మంత్రిని చేయడం ద్వారా అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల్లోని ముస్లింలను సంతృప్తి పరచవచ్చని, ఇక్కడ వైసీపీ ఓటు బ్యాంకును గణనీయంగా తగ్గించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.