తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకున్నవి సాధించుకుంటున్నారు. జిల్లాల సంఖ్యను పెంచాలని అనుకున్నారు. పెంచేశారు. తెలంగాణాలోని కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయాలనుకున్నారు. అదే పనిలో ఉన్నారు. ఇక మిషన్ భగీరధ, ఇంటింటికి నల్లా నీరు లాంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసుకుపోతున్నారు. కెసిఆర్ ఏమీ ఎన్డీఏలో సభ్యుడు కాదు. కనీసం బిజెపితో మిత్రపక్షం కూడా కాదు. అయినా కేంద్రంతో మాట్లాడి అనుకున్న వాటికి అనుమతులు తెప్పించుకోగలుగుతున్నారు. దటీజ్ కెసిఆర్.
జోన్లకు రాష్ట్రపతి ఆమోదం
తాజాగా తెలంగాణా జోన్లకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడితో కెసిఆర్ సమావేశమైనపుడు జోన్లకు అనుమతి విషయం ప్రస్తావించారు. వెంటనే కేంద్రం ఆమోదం వచ్చేసింది. నిజానికి 10 జిల్లాల తెలంగాణాను కెసిఆర్ అనాలోచితంగానే 31 జిల్లాలకు పెంచారు. అయితే ఆ తర్వాత ఎదురైన సమస్యలను అధిగమించటంలో చాకచక్యంతో వ్యవహరించటంతో ఇపుడు రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు. సందర్భం వచ్చినపుడు మోడిని ఎదిరిస్తూనే అవసరం వచ్చినపుడు తగ్గుతూ మోడిని ప్రసన్నం చేసుకుని పనులు చేయించేసుకుంటున్నారు.
చంద్రబాబుకు అన్నీ వైఫల్యాలే
అదే ఏపిలో చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తే అందుకు పూర్తి విరుద్దంగా నడుస్తోంది. నాలుగేళ్ళ పాటు ఎన్గీఏలో భాగస్వామే అయినప్పటికీ రాష్ట్రానికి వచ్చిన ఉపయోగమేమీ కనబడలేదు. స్వయంగా మోడి, చంద్రబాబు ఇద్దరూ కలిసి పోయిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ తో పాటు విభజన చట్టంలో ఒక్క హామీని కూడా పూర్తిగా రాబట్టలేక విఫలమయ్యారు. చివరకు మోడి పెట్టిన పొగను తట్టుకోలేక ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి మోడిపై రంకెలేస్తు కాలం గడిపేస్తున్నారు.