తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారి ఆత్మగౌరవం చాటి చెప్పే విధంగా తెలుగు దేశం పార్టీ స్థాపించి అచిరకాలంలోనే ఏపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కి కుడి భుజంగా నందమూరి హరికృష్ణ ఉండేవారు. అంతే కాదు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని హరికృష్ణనే స్వయంగా నడిపేవారు. తండ్రికి ప్రతి విషయంలోనూ చేదువాదోడుగా ఉంటూ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునే వారు.
అనూహ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం..ఎన్టీఆర్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి వర్గీయులు చంద్రబాబు వర్గీయులను అక్కడకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో తప్పని సరి పరిస్థితిలో చంద్రబాబు కూడా దూరంగా కూర్చోవాల్సి వచ్చింది.
అయితే తండ్రి మరణించే సమయానికి హరికృష్ణ విదేశాల్లో ఉన్నారు..తండ్రి మరణవార్త తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్న హరికృష్ణ.. తల్లిదండ్రులు బసవతారకం, ఎన్టీఆర్ ఉన్న ఫొటో పట్టుకుని స్టేడియానికి వచ్చేశారు. ఆ సమయంలో హరికృష్ణను చూసిన లక్ష్మీపార్వతి అనుచరులు షాక్ తిన్నారు..ఆయన ఉగ్ర నరసింహుడిగా గర్జిస్తూ రావడాన్ని చూసి వెంటనే వెనక్కి తగ్గారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం ఎన్టీఆర్ అంత్యక్రియలను నిర్వహించింది.