రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోయిన కేసిఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో మోడీ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలపాలని కేసీఆర్ ప్రధాని మోడీకి విన్నవించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది.
తాజాగా ఇటీవల రాష్ట్రపతి సంతకం అనంతరం కేంద్ర హోంశాఖ వెంటనే గెజిట్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలోని ఉద్యోగాలు అధికంగా స్థానికులకే దక్కబోతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్గా పరిగణిస్తారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడంతో శాసనసభను రద్దు చేసే ముందే కొత్త ఉద్యోగాల నియామకాలకు ఉత్తరువులు రాబోతున్నాయి. ఎప్పటినుండో అపరిష్కృతంగా ఉన్న ఈ నూతన జోనల్ వ్యవస్థ తెరాస బీజేపీ మధ్య పొడుస్తున్న పొత్తుకు నిదర్శనమా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ తెరాసకు సహకరిస్తే...ఆ తరువాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతామని కేసీఆర్ ప్రధాని మోడీకి వాగ్దానం చేసినట్టు రాజకీయాల్లో వినబడుతున్న టాక్.