తెలుగుదేశంపార్టీలో పరిస్దితులు చూస్తుంటే నేతలపై చంద్రబాబునాయుడు పట్టు కోల్పోతున్నట్లే కనబడుతోంది. ఒకపుడు చంద్రబాబు మాటంటేనే పార్టీలో శిలాశాసనం. బయట ఎవరు ఎలా మాట్లాడినా చంద్రబాబు ముందుకొచ్చే సరికి నోరెత్తేవారు కాదు. ఇష్టమున్నా లేకపోయినా చంద్రబాబు నిర్ణయమే ఫైనల్. కానీ ఇపుడు పరిస్దితులు అలా కనిపించటం లేదు. చంద్రబాబుతో సంబంధం లేకుండానే ఎవరిష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇంకొందరైతే చంద్రబాబు పైనే ఒత్తిడి పెట్టి తమదారిలోకి తెచ్చుకుంటున్నారు.
నేతల ఒంటెత్తు పోకడలు
ఇదంతా ఇపుడెందుకంటే, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ ఒంటెత్తు పోకడలు పోతున్నారో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు ఎంపిగా పోటీ చేస్తారంటూ జేసి దివాకర్ రెడ్డి ప్రకటించేసుకున్నారు. తాడిపత్రిలో తన కుమారుడే పోటీలో ఉంటారని జేసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
జేసిలతో మొదలైంది
జేసి సోదరులిద్దరూ చంద్రబాబుతో సంబంధం లేకుండానే ప్రకటించేసుకోవటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాళ్ళ పిల్లలద్దరు పోటీ చేస్తారని ప్రకటించుకోవటం ఒక ఎత్తైతే జిల్లాలో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ ఎంపి చంద్రబాబుకే కండీషన్లు పెడుతుండటమే విచిత్రంగా ఉంది. జిల్లాలోని 14 సీట్లలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ చంద్రబాబు ముందు ఓ జాబితా కూడా పెట్టారట. సరే, చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారా ? ఇవ్వరా ? అన్నది వేరే సంగతి. కానీ ఓ ఎంపి, ఎంఎల్ఏ చంద్రబాబును శాసించేవిధంగా మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
కండీషన్లు పెడుతున్న మాగుంట
ఇక, ప్రకాశం జిల్లా పరిస్దితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎంఎల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎంపిగా పోటీ చేయమని అడిగారు. అప్పటికే మాగుంట త్వరలో వైసిపిలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆ నేపధ్యంలోనే మాగుంటపై ఒత్తిడి పెట్టి చంద్రబాబు ఎంపిగా పోటీ చేయించేందుకు ఒప్పించారని ప్రచారం జరుగుతోంది. అదే అదునుగా భావించిన మాగుంట ఒంగోలు ఎంపి పరిధిలో తాను చెప్పిన వారికి ఎంఎల్ టిక్కెట్లు ఇస్తేనే తాను ఎంపిగా పోటీ చేస్తాననే కండీషన్ పెట్టారట. దాంతో వేరే దారిలోక చంద్రబాబు అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
చాలా చోట్ల ఇదే వరస
కర్నూలు జిల్లాలో పరిస్దితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కర్నూలు, ఆళ్ళగడ్డ, నంద్యాల, బనగానపల్లి నియోజకవర్గాల్లో ఎవరికివారుగా టిక్కెట్లు ప్రకటించేసుకుంటున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో కూడా అక్కడి నేతలదే హవా. వారెవరూ చంద్రబాబు మాట వినే పరిస్దితుల్లో లేరు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, అనకాపల్లి, విశాఖపట్నం దక్షిణంలో కూడా సేమ్ టు సేమ్. తూర్పుగోదావరి జిల్లాలోని తుని, చోడవరం రాజమండ్రిలో కూడా యనమల రామకృష్ణుడే టిక్కెట్లు ఇప్పటికే ప్రకటించేశారు. చూడబోతే వచ్చే ఎన్నికలనాటికి అభ్యర్ధులను ప్రకటించేందుకు చంద్రబాబు పెద్దగా కష్టపడక్కర్లేదనే అనిపిస్తోంది. ఇవన్నీ కూడా పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారనటానికి నిదర్శనాలే కదా ?