ఆ మధ్య వచ్చిన సినిమాలో ఓ పాపులర్ డైలాగుంది. ' చూడు....బాగా చూడు. పూర్తిగా చంద్రముఖిగా మారిపోతున్న నీ భార్య గంగను బాగా చూడు అని. చంద్రబాబునాయుడు పరిస్ధితి ఇపుడు అలాగే ఉంది. తనను తాను పూర్తి ప్రజాస్వామ్య వాదిగా ప్రచారం చేసుకునే చంద్రబాబులో నియంత లక్షణాలు స్పష్టంగా బయటపడుతోంది. తనను ఎవరైనా ప్రశ్నించినా, నిలదీసినా తట్టుకోలేకున్నారు. మీడియా సమావేశమైనా, బహిరంగసభైనా ఒకటే. చంద్రబాబు ఆలోచన ఎలాగుందంటే, తనమాటకు ఎవరూ ఎదురుచెప్పకూడదు. గుంటూరులో జరిగిన నారా హామారా-టిడిపి హమారా అనే బహిరంగసభ సందర్భంగా చంద్రబాబులోని నియంత లక్షణాలు మరోసారి బయటపడ్డాయి.
వ్యతిరేక నినాదాలు
ఇంతకీ విషయం ఏమిటంటే, నారా హమామా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు కొందరు ముస్లిం యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంతే. ఎవరి సభలో అయినా సాధారణంగా జరిగేదే. ఇందులో చంద్రబాబుకు జరిగిన అవమానమంటూ ఏమీ లేదు. ఎందుకంటే, వారు చేసిన నినాదాలు కూడా పోయిన ఎన్నికల్లో చంద్రబాబిచ్చిన హామీలను గుర్తుచేయటమే.
36 గంటలు జాడే తెలీలేదు
సభలో నినాదాలు చేస్తున్న తొమ్మదిమంది యువకులను పోలీసులు, టిడిపి నేతలు అప్పుడే బటయకు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత 36 గంటల పాటు వారి జాడ తెలీలేదు. తీరా చూస్తే వారిపై అనేక రకాలైన క్రిమినల్ ఛార్జెస్ పెట్టారు. పైగా దేశద్రోహం కేసు కూడా బనాయించారు. వారంతా ప్రత్యేక దేశం కోసం కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు తమ చార్జిషీటులో పేర్కొని అందరినీ కోర్టులో ప్రవేశపెట్టారు. సరే వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందనుకోండి అది వేరే సంగతి.
ముస్లింలు ఓట్లేస్తారా ?
ఇక్కడ విషయం ఏమిటంటే హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని, ఇచ్చిన హామీలను గుర్తు చేసిన వారిని కూడా చంద్రబాబు సహించలేకపోతున్నారు. అసలు సభ పెట్టిందే వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓట్లను కొల్లగొట్టటం కోసం. కానీ జరిగిందేమిటి ? ముస్లిం సభలో తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తొమ్మిదిమంది ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యవాదిగా తన భుజాలు తానే చరుచుకునే ' 40 ఇయర్స్ ఇండస్ట్రీ' చేయాల్సిన పనేనా ఇది ? అదే విషయాన్ని టిడిపి గుంటూరు జిల్లా కార్యదర్శి మీరావలి కూడా ప్రశ్నిస్తున్నారు. న్యూసెన్స్ కేసు పెడతామని చెప్పి దేశద్రోహం కేసు పెట్టటం ఏంటని మీరావలి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రజాస్వామ్య వాది చేయాల్సిన పనేనా ?
ఇచ్చిన హామీలను గుర్తు చేసినందుకే ముస్లిం యువకులపై ఈ విధమైన కక్షసాధింపు చర్యలకు పూనుకుంటే ఇక వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చంద్రబాబుకు ఎలా పడతాయి ? సభలో అల్లరి చేసే వాళ్ళని మామూలుగా అయితే బయటకు తీసుకెళ్ళి పోలీస్టేషన్లో పెడతారు. సభ అయిపోయిన తర్వాత వదిలేయటం మామూలుగా జరిగేదే. ఈ విధంగా దేశద్రోహం కేసులు పెట్టిన ఘటనలైతే ఎప్పుడూ లేదు. ఇంత చిన్న విషయానికి చంద్రబాబు అంతలా రియాక్ట్ అయ్యారంటేనే గంగ చంద్రముఖిలా మారినట్లే ప్రజాస్వామ్య వాదినని చెప్పుకునే చంద్రబాబు నియంతలా మారిపోతున్నట్లే కనబడుతోంది.