నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు పూర్తిగా అధికార తెలుగుదేశంపార్టీకి వత్తాసు పలుకుతున్నారు. టిడిపి నేతలెవరిపై కేసులు పెట్టమంటే వారిపై పెట్టేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే అరెస్టులు కూడా చేసేసి రిమాండ్ కు పంపేస్తున్నారు. ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పరు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారంటే సమాధానమివ్వరు. మొత్తం మీద చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది.
జేసి ఫిర్యాదు చేస్తే అరెస్టేనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. సరే పోలీసులు కేసులు పెట్టాలంటే పెద్దగా విషయమేమీ అవసరం లేదు. ఎవరైనా టిడిపి నేత ఫిర్యాదు చేస్తే చాలు. ఏం కేసు పెట్టాలి ? ఎలా పెట్టాలన్నది పోలీసులే చూసుకుంటారు. ఇక్కడ జరిగింది కూడా అదే. తాడిపత్రి ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే వైసిపి నేత పెద్దారెడ్డిపై కేసు పెట్టేసి అరెస్టు చేసేశారు. లేకపోతే ఎంఎల్ఏ పోలీస్టేషన్ కు వచ్చి పోలీసులనే కొట్టగలరు. ఆ భయంతోనే పెద్దరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
సభ పెడితే అరెస్టులు చేస్తారా ?
యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలో వైసిపి కార్యకర్త భాషాపై అదే గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు, జేసి మద్దతుదారులు మోహన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు దాడి చేసి కొట్టారు. బాధితుడిని పరామర్శించేందుకు పెద్దారెడ్డి గ్రామానికి వెళ్ళారు. తర్వాత బస్టాండ్ ప్రాంతంలో సభ పెట్టారు. అంతే ఎంఎల్ఏకి ఆగ్రహం వచ్చేసింది. తనకు వ్యతిరేకంగా సభ పెడతారా ? అంటూ మండిపోయి పోలీసులను ఉసిగొల్పారు. దాంతో వారొచ్చి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు పెట్టి అరెస్టు చేశారు.