భారత్ విదేశీ విరాళాలను అంగీకరించే విషయంలో కొన్ని నియమ నిబందనలను ఏర్పరచుకొంది. ఏ విదేశీ ప్రభుత్వమైనా ఇంకెవరైనా మనదేశానికి గాని రాష్ట్రాలకు గాని సంస్థలకుగాని విరాళాలు షరతులు లేకుండాయివ్వవు. అందుకే ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనా కాలంలో విదేశీ విరాళాలు స్వీకరించరాదన్న నిర్ణయాన్ని తీసుకుంది. తమ ఇబ్బందులను ప్రకృతి విపత్తులతో సహా తామే నియంత్రించుకోగల సామర్ధ్యమున్న సార్వభౌమరాజ్యంగా భావించుకుంది. అందుకే విదేశీ విరాళాలు అంగీకరించే పరిస్థితులు భారత్ ప్రస్థుతం లేవు. కేరళ ప్రకృతి విపత్తుకు ధారుణంగా గురవ్వటంతో తిరిగి ఆ విషయమై విభేదాలు వెల్లువౌతున్నాయి.
వరదలతో ధారుణంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం విదేశీ ఆర్ధిక సహాయాన్ని పొందేందుకు వీలుగా, చట్టపరమైన అవకాశాలన్నింటినీ, తమ ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పష్టం చేశారు. "యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యూఏఈ" ₹700 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించిందంటూ ప్రచారం జరగటం, ఆ సంధర్భంగా విదేశీ విరాళాలను అనుమతించబోమని కేంద్రం తేల్చిచెప్పడంపై వివాదం నెలకొన్ననేపథ్యంలో సిఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి.
వరద బీభత్సం తదనంతరం తొలిసారిగా కేరళ రాష్ట్ర శాసనసభ గురువారం అంటే నిన్న సమావేశమైంది. సహాయ, పునరావాస చర్యలపై చర్చించేందుకు ఒక్కరోజు శాసనసభ సమావేశాన్ని స్పీకర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాజాగా ప్రకృతి పరంగా వెల్లువైన వరదలు, తద్వారా రాష్ట్రానికి సంభవించిన పెను ప్రమాదం తదనంతర పరిణామాలను సీఎం శాసనసభకు వివరించారు.
ఋతుపవనాలు ప్రవేశించిన మే 28తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 483మంది మృత్యువాత పడ్డారని, మరో 14మంది ఆచూకీ నేటికీ తెలియదని, 57వేల హెక్టార్ల వ్యవసాయ భూములు వరద నీట మునిగాయని, వరదల కారణంగా వాటిల్లిన నష్టం ₹37,348 కోట్లని అది రాష్ట్ర వార్షిక బడ్జెట్ కన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చునని సభకు వెల్లడించారు.
కేరళ రాష్ట్రాన్ని ఈ విపత్తు నష్టం నుంచి ఆదుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ విరాళాలు వెల్లువెత్తాయి. ఆ ఆర్థిక సాయాన్ని అందుకునేందుకు చట్టపరంగా ప్రయత్నిస్తాం అని విజయన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ₹600 కోట్ల నిధులు కేటాయించింది. మరికొంత సాయాన్ని కూడా కేంద్రం నుంచి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి బుధవారం వరకు ₹730 కోట్ల నిధులు విరాళాల రూపంలో వచ్చాయని కూడా ఆయన తెలిపారు. మరోవైపు కేరళ అఖిలపక్ష బృందం
గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ను కూడా కలిసింది. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థికసాయాన్ని అందించాలని కోరింది. ఇప్పుడు ఈ సంధర్భం గా విదేశీ విరాళాలు అంగీకరించటం విషయంలో కేంద్రానికి కేరళ రాష్ట్రానికి విభేదాలు పోడచూపే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి.