ప్రముఖ సినీనటుడు, అక్కినేని నాగేశ్వరర్రావు వారసుడు అక్కినేని నాగార్జున రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యంతో ఉన్నారా ? ఇపుడందరిలోనూ ఇవే అనుమానాలు మొదలయ్యాయి. మామూలుగా అయితే నాగార్జున రాజకీయాలకు దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం నుండి నాగార్జునకు రాజకీయ వాసనలు తగులుతున్నాయి. అప్పట్లో ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం రూపొందించిన కొన్ని అడ్వర్టైజ్ మెంట్లలో నాగార్జున నటించారు.
ఆరోగ్య శ్రీ కి ప్రచారకర్తగా
అంతకుముందు చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు ఎప్పుడూ ప్రభుత్వం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అటువంటిది ఆరోగ్యశ్రీ ప్రకటనల్లో వైఎస్సార్ అడగటం వల్లే నటించినట్లు చెప్పుకున్నారు. అప్పటి నుండి వైఎస్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, హటాత్తుగా వైఎస్ మృతిచెందటంతో కొంత కాలం గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ వైఎస్సార్ వారసుడు, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యక్షంగా ఎక్కడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎటువంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు.
జగన్ ను కలిసిన రాము
అటువంటిది అక్కినేని అభిమాన సంఘాల తరపున వెలుగు చూసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్ పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతుంటుందని అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అభిమాన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బి. రాము పేరుతో ఓ ప్రకటన రిలీజైంది. జగన్ ఆశయసాధనకు తమవంతు కృషి చేయాలని అక్కినేని అభిమానులంతా నిర్ణయించుకున్నట్లు రాము ప్రకటించటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ అండగా ఉంటామన్నారు. విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను రాము కలిసి మద్దతు ప్రకటించారు.
నాగార్జున అనుమతి లేకుండానే కలిశారా ?
ఇక్కడ విషయం ఏమిటంటే నాగార్జున అనుమతి లేకుండానే రాము ఇటువంటి ప్రకటన చేసే అవకాశం లేదు. జగన్ కు మద్దతుగా అక్కినేని అభిమాన సంఘాల అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారంటే కచ్చితంగా నాగార్జున అనుమతితోనే జరిగి ఉంటుందనటంలో సందేహం లేదు. నాగార్జున సినీ జీవితం దాదాపు ముగింపుకు వచ్చేసినట్లే అనుకోవాలి. ఒకవైపు ఇద్దరు కొడుకులు సినిమాల్లో బిజీ అయిపోవటం వల్లే నాగార్జున కూడా సినిమాలను తగ్గించేసుకున్నారు.
వైసిపి నుండే రాజకీయాల్లోకి
అదే సమయంలో రాజకీయాలవైపు అడుగులు వేసే విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, వైసిపి నుండే రాజకీయ అరంగేట్రం జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున కుటుంబంతో సన్నిహితంగా ఉండే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైసిపిలో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. అదే పద్దతిలో నాగార్జున కూడా త్వరలో వైసిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నాగార్జున నుండి నేరుగా స్పష్టత రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.