చూడబోతే విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఎంఎల్ఏ కూడా వైసిపి నుండి జంప్ అవుతారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రతిపక్షంలోని ఎంఎల్ఏ తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయం ఎక్కడైనా జరిగేదే. కానీ అదే ఎంఎల్ఏ స్వపక్షంపైన కూడా ఆరోపణలు చేస్తుంటే ఏమని అనుకోవాలి ? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలను అరికట్టటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు.
పెరిగిపోతున్న విషజ్వరాలు
రాష్ట్రంలోని చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు, అంటువ్యాధులను అరికట్టటంలో ప్రభుత్వం ఘొరంగా విఫలమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో విజయనగరం జిల్లాలోని సాలూరు ప్రాంతం కూడా ఒకటి. అందుకే విషజ్వరాలు పెరిగిపోతున్నట్లు రాజన్నదొర ఆరోపించారు. జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అనే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ ఆ తర్వాత చేసిన ఆరోపణలే అనుమానంగా ఉంది.
సొంత పార్టీనే బెదిరిస్తున్నారు
ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టటంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కూడా నిద్రలో జోగుతోందంటూ సొంతపార్టీపైనే మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై తమ పార్టీ మూడు రోజుల్లోగా యాక్షన్లోకి దిగకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరించటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో విషజ్వరాలతో ఇంతమంది మరణిస్తుంటే తమ పార్టీ నేతలు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ధ్వజమెత్తటం విచిత్రంగా ఉంది.
అనుమానంగా ఉన్న ఎంఎల్ఏ వైఖరి
ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలుంటే కార్యకర్తలను సమీకరించి ఎంఎల్ఏగా తానే ఆందోళనలు చేయవచ్చు కదా ? ఎవరు వద్దన్నారు ? ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలపై పోరాటం చేయవద్దని ఎంఎల్ఏని ఎవరైనా అడ్డుకుంటున్నారా ? ఏజెన్సీ ప్రాంతంలోని సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలోని నేతలను ఆ ప్రాంతానికి పిలిపిస్తానంటే ఎవరైనా కాదన్నారా ? ఇవేవీ చేయకుండా సొంతపార్టీపైనే ఆరోపణలు చేయటం పైగా రాజీనామా చేస్తానని బెదిరించటం చూస్తుంటే ఎంఎల్ఏ తీరుపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
.