వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపిల మధ్య పొత్తుల్లో సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా ? జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తులు తప్పవని అందరికీ అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికల్లో టిడిపికి కాంగ్రెస్ ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై ఇప్పటికే నిర్ణయమైపోయిందని ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తెందుకంటే, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు చేయలేరన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు పొత్తులు పెట్టుకోవటానికి కాంగ్రెస్ తప్ప ఇంకే పార్టీ మిగల్లేదు. ప్రతీ ఎన్నికకు ఒక పార్టీతో జతకట్టే ఆలవాటున్న చంద్రబాబు ఒక్క కాంగ్రెస్ తో తప్ప మిగిలిన అన్నీ పార్టీలతో పొత్తులు అయిపోయాయి.
తెలంగాణాలో టిడిపికి 15 అసెంబ్లీ, 1 ఎంపి సీటు
ఆ నేపధ్యంలోనే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే కాంగ్రెస్ తో రాసుకుపూసుకు తిరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధితో సన్నిహితంగా మెలుగుతున్నారు. మొన్నటి రాహూల్ తెలంగాణా పర్యటనలో హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హాజరైన విషయం అందరూ చూసిందే. ఇవన్నీ పొత్తులు ఖరారయ్యాయనటానికి నిదర్శనాలు. కాకపోతే ఎన్నికల ప్రకటన వరకూ బహిరంగంగా ప్రకటించకపోవచ్చంతే. టిడిపికి 15 అసెంబ్లీ, ఒక ఎంపి స్ధానం కేటాయించటానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందని ప్రచారం జరుగుతోంది.
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టిడిపి సేమ్ టు సేమ్
అయితే, ఇక్కడో మెలిక కూడా ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తుంటే తెలంగాణా, ఏపిలో కూడా ఉండాల్సిందే. ఎందుకంటే, రెండు పార్టీల పరిస్ధితి రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే విధంగా ఉండటం యాధృచ్చికమే. తెలంగాణాలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా కనిపిస్తుంటే టిడిపి దయనీయమైన స్ధితిలో ఉంది. కాబట్టి తెలుగుదేశంపార్టీకి నాలుగు సీట్లు రావాలంటే కాంగ్రెస్ తో పొత్తు తప్పనిసరి. అదే సమయంలో ఏపిలో టిడిపి అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ఇమేజి నేలబారుకు పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే అయినా తమకు నాలుగు సీట్లు వస్తాయనే ఆశతో కాంగ్రెస్ నేతలున్నారు.
ఏపిలో కాంగ్రెస్ కు 15 అసెంబ్లీ, ఒక ఎంపి
తెలంగాణాలో టిడిపికి కాంగ్రెస్ 15 అసెంబ్లీ, ఒక ఎంపి సీటిచ్చినట్లే ఏపిలో కాంగ్రెస్ కు టిడిపి అన్నే సీట్లివ్వటానికి సిద్దపడినట్లు సమాచారం. కాంగ్రెస్ కు ఇచ్చే 15 అసెంబ్లీ సీట్లు కూడా టిడిపి బలహీనంగా ఉన్నవి, ఫిరాయింపు ఎంఎల్ఏలున్న సీట్లే ఎక్కువని సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలంటున్నాయి.
ఎన్నికల ముందు బహిరంగ ప్రకటన
ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల కాలం ఉంది కాబట్టి పొత్తులపై బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, తెలంగాణాలో కొందరు కాంగ్రెస్ నేతలు, ఏపిలో కొందరు సీనియర్ మంత్రులు పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. వీరందిరికీ కౌన్సిలింగ్ చేసి దారిలోకి తీసుకు రావటానికి కొంత కాలం పడుతుంది. తెలంగాణాలో ఉత్తమైనా ఏపిలో చంద్రబాబైనా ఇపుడదే పనిలో ఉన్నారు. ఎన్నికల తేదీపై స్పష్టత వస్తే పొత్తులను కూడా ప్రకటిస్తారు. కాకపోతే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూడాల్సిందే.