ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికలకు రెడీ అంటున్నాయి. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన ఏం చేస్తోంది ? ఏం చేస్తోందంటే అవుడేటెడ్ నేతలను చేర్చుకుంటోంది. ఇప్పటి వరకూ జనసేనలో ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పేరున్న నేత జనసేనలో చేరలేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్రముఖులవరైనా చేరారా అంటే అదీలేదు. మరి ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలను జనసేన ఏ విధంగా ఎదుర్కోవాలని అనుకుంటోందో అర్ధం కావటం లేదు.
ఇద్దరు అవుడేటెడే ?
ఇప్పటి వరకూ జనసేనలో చేరింది తూర్పు గోదావరి జిల్లాలోని కందుల దుర్గేష్, పంతం నానాజి, హరిరామజోగయ్య, ముత్తా గోపాలకృష్ణ, ముత్తా శశిధర్ మాత్రమే. వీరిలో గట్టి నేతలెవరంటే ఠక్కున సమాధానం చెప్పటం కష్టమే. ఎందుకంటే, గట్టి నేతలను పక్కనపెట్టినా హరిరామజోగయ్య, ముత్తా గోపాలకృష్ణ ఇద్దరూ అవుడేటెడ్ పొలిటీషియన్సే. వీళ్ళిద్దరినీ జిల్లాలోని జనాలు మరచిపోయే చాలా కాలమైంది. వీరిద్దరూ ఇప్పటి వరకూ ఎన్ని పార్టీలు మారారో వాళ్ళే చెప్పలేరు.
వీళ్ళకున్న ఫాలోయింగేంటో ?
ఇక, నానాజి, దుర్గేష్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చారు. వాళ్ళకి కూడా జిల్లాలో పెద్ద ఫాలోయింగేమీ లేదు. ఇప్పటికైతే వీళ్ళే జనసేనలో చేరిన ప్రముఖలు. ఇటువంటి ప్రముఖులు ఇంకా ఎంతమంది జనసేనలో చేరుతారో ఎవరూ చెప్పలేకున్నారు. ఇటువంటి ప్రముఖులను పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకుంటే అంతే సంగతులు. ఇక, జనసేనలో చేరటానికి 20 మంది ఎంఎల్ఏలు సిద్దంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాళైనా గట్టి వాళ్ళు చేరుతారా ? లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావని డిసైడ్ అయిన వాళ్ళే చేరుతారా ?