గత ఎన్నికల్లో వారిద్దరిది ఒకే పార్టీ.. ఒకరు ఎంపీగా పోటీ చేసి, మరొకరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. గెలుపులో ఒకరికొకరు సహకరించుకున్నారు.. కానీ.. ఎప్పుడైతే వారు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారో.. అప్పటి నుంచి వారిద్దరి మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడది మరింతగా పెరిగింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే అని ఆలోచిస్తున్నారా..? వారు మరెవరో కాదు.. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసర్రెడ్డి, వైరా ఎమ్మెల్యే మదన్లాల్. ఇప్పుడు వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా.. విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు దూకుడు పెంచుతుంటే.. పలువురు నేతలు మాత్రం ఇలా తమ పనితీరుతో పార్టీలో గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారని పార్టీశ్రేణులు మండిపడుతున్నాయి. నిజానికి.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వైరా ఎమ్మెల్యేగా బాణోత్ మదన్లాల్ గెలిచారు. అప్పట్లో మదన్లాల్ గెలుపునకు పొంగులేటి బాగా సహకరించారు. అయితే.. వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బేదాభిప్రాయాలు వచ్చాయి. ముందుగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్లో చేరిన మదన్లాల్ మంత్రి తుమ్మల అనుచరుడిగా మారారు.
మదన్లాల్ దుందుడుకు శైలితో పార్టీ క్యాడర్తోపాటు ఆయన అత్యంత సన్నిహితులు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజల్లో మరింత వ్యతిరేకవత వస్తోంది. వైరాలో మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించారు. అయితే, ఇందులో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు ఆయనకు నచ్చిన వారిని అధికారులుగా నియమించడం.. నచ్చకపోతే బదిలీలు చేయించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులు కూడా దురమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా.. వచ్చే ఎన్నికల్లో ఐదారుగురు సిట్టింగులకు టికెట్లు రావంటున్న జాబితాలో మదన్లాల్ కూడా ఉంటారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే సమయంలో మదన్లాల్కు టికెట్ రాకుండా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మదన్లాల్కు టికెట్ రావడం కష్టమేనని పలువురు నాయకులు అంటున్నారు. ఇక ఈ సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చినట్లు చెబుతున్నారు. మదన్లాల్ విషయంలో మంత్రి కూడా ఏమీ చేయలేరని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన వైరా నియోజకవర్గంలో సొంత సామాజికవర్గం బంజారాల నుంచి కూడా మదన్లాల్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పలు తండాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదన్లాల్కు సహకరిస్తే.. తనకు చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా మరికొందరు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పేరు వినిపిస్తోంది. ఆమెకు ఎంపీ పొంగులేటి, మంత్రి కేటీఆర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది.