తెలంగాణా రాష్ట్ర సమితి నిర్వహించిన "ప్రగతి నివేదన సభ" అది ఆసాంతం విఫల ప్రయోగం అంటే - అట్టర్ ఫ్లాప్ షో - అని, ప్రగతి నివేదన కాదని, ప్రజా వేదన సభ గా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. నిండుసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడారని దాంతో ఆయన దొంగ ఆటలు బయట పడ్డాయని విమర్శించారు.
ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభతో కేసీఆర్ తన అధికారం, పదవీ, ధనబల అహంకారాన్ని, ఆహాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ ప్రదర్శన కేసీఆర్ అవినీతిని ప్రపంచం నివ్వెరపోయేలా బట్టబయలైందని గమనించాలని అన్నారు. ప్రగతి నివేదన పేరు తో ₹300 కోట్ల అవినీతి సొమ్ము, చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సభలో కేసీఆర్ ప్రసంగం చాలా పేలవంగా దీలా ప్స్డి తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా బెదిరించి ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను చట్టవిరుద్ధంగా తీసుకున్నారని,
ఆర్టీసీ బస్సులు వాడుకున్నారని - ప్రతి బస్ స్టాండ్ లో బస్సులన్నీ సభకు తరలి పోయినట్లు ప్రకటనలే నోటీస్ బోర్డ్ లో పెట్టటాన్ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క విద్యుత్ ప్రాజెక్టయినా మొదలుపెట్టారా..? అని నిలదీశారు. మిషన్ భగీరథ ద్వారా 10 శాతం ఇండ్లకు కూడా నీళ్లివ్వలేదని, చెప్పిన సమయానికి నీళ్లివ్వడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. అది మిషన్ భగీరథ కాదని, కమీషన్ భగీరథ అని వ్యాఖ్యానించారు.
*కేసీఆర్ ప్రసంగం లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు,
*ముస్లిం రిజర్వేషన్లు,
*గిరిజన రిజర్వేషన్లు,
*దళితులకు మూడెకరాల భూమి
అత్యంత ప్రధాన విషయాలైన వీటి గురించి, అసలు నిబద్ధతే లేని కేసీఆర్, రాష్ట్ర ప్రజలను సర్వదా మందులో ముంచి మాయచేసిన విషయాన్ని ప్రస్తావించ లేదన్నారు.
*కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 అయిందని, *అవినీతిలో నంబర్ వన్ అయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్
*అధికారంలోకి వచ్చాక నాలుగు వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. *నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్ ప్రసంగం సాగిందని విమర్శించారు.
ఢిల్లీకి తాము చెంచాలం కాదని, కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి చెంచా అని, ఆయనకు ఏజెంట్ గా పనిచేస్తున్నారని అన్నారు. "కేసీఆర్ హఠావో- తెలంగాణ బచావో " నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని ఉత్తమ్ ఉద్ఘాటించారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ అది ప్రగతి నివేదన సభ కాదని, ముక్క, చుక్క, లెక్క సభలా సాగిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల మీద, మాట నిలబెట్టుకోవడం మీద, తెలంగాణ ప్రగతి మీద కేసీఆర్ చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అది ప్రగతి నివేదన కాదని, జనావేదన అని, చెప్పుకోవడానికి ఏమీ లేక పేలవంగా సభను ముగించారని అన్నారు.
శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తొలి నుండీ నిశితంగా గమనించింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా కొనసాగిన - నిర్వహించిన సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే దానిపై ఆ పార్టీ ముఖ్యులు ఆరా తీశారు. ఆదివారం ఉదయం నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు - రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, క్షేత్ర స్థాయి కార్యకర్తల వరకు ప్రగతి నివేదన సభ పరిణామాలను సభ నిర్వహణ తీరును గమనిస్తూ వచ్చారు. సభకు కార్యకర్తలను ఎలా తరలిస్తున్నారు? ఏ నాయకుడి ఆధ్వర్యంలో, ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది వెళ్లారనే లెక్కలపై ఆరాతీశారు.
మరోవైపు హైదరాబాద్లో మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం రాత్రే సమావేశమయ్యారు. సమావేశానికి టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ అనుసరించే వ్యూహంతో పాటు చేయనున్న ప్రకటనల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడవద్దని, అవసరమైతే ఎన్నికలకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సమర్ధులైన ముఖ్య నేతలను వెంటనే చేర్చుకోవాలని నిర్ణయించారు.