తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి సభ నిజంగా 'నభూతో నభవిష్యతి' అన్నట్లు ఆ సభ జరిగింది. భారీ జన సమీకరణ అంటే మాటలు కాదు సుమారు 25 లక్షల మందిని జనాలను సభకు తరలించాలంటే భారీగా ఖర్చు పెట్టాలి. తెలంగాణలో అన్నిదారులూ హైద్రాబాద్ వైపుకే అన్నట్లుగా అన్ని రహదార్లపైనా గులాబీ జెండాలతో నిండిన వాహనాలు కన్పిస్తున్నాయి. 'ఇదొక చరిత్ర..' అంటూ టీఆర్ఎస్ నేతలు అప్పుడే సంబరాలు షురూ చేసేశారు. మొత్తంగా అధికార యంత్రాంగమంతా బహిరంగ సభ జరగనున్న కొంగరకలాన్ ప్రాంతం మీదనే ఫోకస్ పెట్టింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై సాధారణ ప్రయాణీకులు వాహనాల్ని నడపడం మానుకుంటే మంచిదనే 'సూచనలు' బహిరంగ సభ భారీతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి.మొత్తంగా 25లక్షల మంది జనం ఈ బహిరంగ సభకు తరలివస్తున్నారంటే.. ఖర్చు ఏ స్థాయిలో జరుగుతుండొచ్చు.? ఔటర్ రింగ్ రోడ్డుపై రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు టోల్ గేట్లు 'రుసుముల్ని' వసూలు చేయవు.
దానికి సంబంధించి 87 లక్షల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున చెల్లింపు ముందస్తుగానే జరిగిపోయింది. సభకు వచ్చేవారిని తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్సులకే కోట్ల రూపాయలు చెల్లించేశారు. మంచి నీళ్ళు, ఆహారం.. ఇతరత్రా ఏర్పాట్లకూ కోట్ల రూపాయల ఖర్చు తప్పనిసరి. అన్నిటికీ మించి మీడియాలో 'నభూతో నభవిష్యతి' అనే స్థాయిలో జరుగుతున్న ప్రచారానికి ఇంకెన్ని కోట్లు రూపాయలు ఖర్చు చేస్తుండొచ్చు.? అంటే, అంచనా వేయడం కష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఖర్చు చేయని స్థాయిలో 'ప్రగతి నివేదన' సభ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖర్చు చేయబోతున్నారన్నమాట.