చూడబోతే చంద్రబాబునాయుడు పూర్తిగా అలాగే ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే తెలుగుదేశంపార్టీని బాగా అభిమానించే పలువురు అధికారులకు ప్రభుత్వంలో కీలక స్ధానాలు కట్టబెట్టారు. వారు కూడా శక్తవంచన లేకుండా ప్రభు భక్తిని చాటుకుంటున్నారు. చాలా జిల్లాల్లోని ప్రభుత్వ యంత్రాంగంలోని పలువురు అధికారులు తెలుగుదేశంపార్టీ నేతల్లాగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్లుగా త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను మార్చాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు టిడిపి మీడియా చెబుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగిన ఉన్నతాధికారులను నియమించనున్నారనే షుగర్ కోటింగ్ వేస్తోందనుకోండి అది వేరే సంగతి. ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళటమంటే టిడిపికి ప్రచారం చేయటమని వేరే చెప్పక్కర్లేదు.
పాలక పార్టీ సానుభూతిపరులకే అందలాలు
తమిళనాడులో ఈ తరహా పాలన ఎప్పటి నుండో జరుగుతోంది. నిజానికి ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీలతో సంబంధాలు ఉండకూడదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా యంత్రాంగం మాత్రం నియమ, నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. కానీ అలా జరగటం లేదు. తమ స్వార్ధం కోసం పాలకులు యంత్రాంగాన్ని లోబరుచుకుంటున్నారు. దాంతో అధికారుల్లో చాలామంది పాలకులకు సరెండరైపోతున్నారు. దాంతో అధికారంలో ఉన్న పార్టీ నేతల మాట మాత్రమే చెల్లుబాటవుతోంది. పాలకులను ప్రసన్నం చేసుకోవటంలో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు, వేధింపులు తప్పటం లేదు. డిఎంకె అధికారంలో ఉన్నపుడు ఏఐఏడిఎంకె, ఏఐఏడిఎంకె అధికారంలో ఉంటే డిఎంకె నేతలపై ఈ తరహా కేసులు, వేధింపులు అందరూ చూస్తున్నదే. ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండో పార్టీ సానుభూతిపరులైన యంత్రాంగం లూప్ లైన్లోకి వెళ్ళిపోవటం సాధారణమే.
ప్రభుత్వ యంత్రాంగంతో టిడిపికి ప్రచారం
ఏపిలో కూడా ప్రజలతో నేరుగా సంబంధాలుండే పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కేవలం టిడిపి నేతల మాటలను, ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారు. ఏ అవసరం కోసం వైసిపి ఎంఎల్ఏలు, ప్రజా ప్రతినిధులు, నేతలు వెళ్ళినా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పైగా టిడిపి నేతలు చేస్తే చాలు వైసిపి నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. జన్మభూమి కమిటీల ముసుగులో వివిధ సంక్షేమ పథకాలు కూడా టిడిపి నేతలు సిఫారసు చేసిన వారికి మాత్రమే అందుతున్న విషయం కొత్తేమీ కాదు. క్షేత్రస్ధాయిలో పనిచేసే యంత్రాంగం నుండి ఉన్నతాధికారుల వరకూ దాదాపు ఏకపక్షగానే సాగుతోంది పాలన. అటువంటిది ఇంకా కొంతమంది ఉన్నతాధికారుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. కాబట్టి అటువంటి వారిని కూడా మార్చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.