అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 30 వేల ఓట్లు తెచ్చుకోవటమంటే మామూలు విషయం కాదు. ఆ నేతకు నియోజకవర్గంలోని అన్నీ సామాజికవర్గాల్లో గట్టి పట్టుంటేనే సాధ్యమవుతుంది. అటువంటి నేత త్వరలో వైసిపిలో చేరబోతున్నారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఫ్యాన్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్దమైపోయింది.
ఇండిపెండెట్ గానే సత్తా చాటిన నేత
ఇంతకీ విషయం ఏమిటంటే, విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోట లో ఇందుకూరి రఘురాజు అనే కాంగ్రెస్ నేతున్నారు. 2009లో పార్టీ టిక్కెట్టు ఆశించినా సాధ్యం కాకపోవటంతో ఇండిపెండెట్ గా పోటీ చేశారు. ఓడిపోయినా 31 వేల ఓట్లు తెచ్చుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరే తర్వాత 2014 రాష్ట్ర విభజన నేపధ్యం లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి.
టిక్కెట్టు రాజుకేనా ?
కాంగ్రెస్ అభ్యర్దిగా ఓడిపోయినా నియోజకవర్గాన్ని మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఏమి చేయాలనే విషయంలో రఘురాజు సందిగ్దంలో పడ్డారు. అయితే మద్దతుదారులు మాత్రం వైసిపిలో చేరాలని సలహా ఇచ్చారు. దాంతో రాజు కూడా వైసిపిలో చేరేందుకు రెడీ అయ్యారు. అదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్ళగా రాజును పిలిపించమన్నారు అలా జగన్- రాజుల భేటీ అయ్యింది. తర్వాత తాను తొందరలో వైసిపిలో చేరనున్నట్లు రఘురాజు ప్రకటించారు. ట్రాక్ రికార్డు చూస్తే రఘురాజుకు నియోజకవర్గంలో గట్టిపట్టున్నట్లే కనబడుతోంది. దాంతో తెలుగుదేశంపార్టీలో టెన్షన్ మొదలైంది.