ఎన్నికల ముంగిట నేతల అలకలు.. మెలికలు భలేగా ఉంటాయి. సందు చూసి మందు వేయడానికి అందరూ రెడీగా ఉంటారు. వద్దొద్దు అంటూనే కడుపునిండా మెక్కడం.. తమకేమీ కోరికలు లేవంటూనే ఉన్నవన్నీ కక్కేయడం నాయకులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో..! ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతలు ఇప్పుడే ఇదే చేస్తున్నారు. తమకు వద్దంటూనే అసలు కోరికలను బయటపెడుతున్నారు. ఎక్కడ మెలికపెట్టాలో అక్కడ పెట్టి కూర్చుంటున్నారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తహతహలాడుతున్నారు. ఇందులో ఏపీలో ఓ మంత్రి పేరు బాగా వినిపిస్తోంది. ఆయన మరెవరో కాదు.. సోమిరెడ్డి. ఇటీవల టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన పెట్టిన మెలికపైనే పార్టీ వర్గాల్లో హాట్హాట్గా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ మెలిక ఏమిటో తెలుసుకోవాలనుకుంటే.. ఈ కథనం చదవాల్సిందే మరి.
మంత్రి సోమిరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొవ్వూరు ఉప ఎన్నికలతో కలిసి వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా.. ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు కూడా నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఇటీవల పార్టీ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనే అంశంపై చర్చ జరిగిందట. అపారమైన రాజకీయ, అధికార అనుభవం ఉన్న మంత్రి సోమిరెడ్డి పోటీ చేస్తే ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని, ఆయనపై పోటీ చేసేందుకు ప్రత్యర్థులు కూడా వెనకంజ వేస్తారని ఒక నేత చెప్పారట. దీనిపై సోమిరెడ్డి స్పందిస్తూ తన వద్ద విటమిన్లు లేవు.. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి సమర్థుడైన అభ్యర్థి అని చెప్పారట.
అయితే... మంత్రి సోమిరెడ్డి విటమిన్లు అన్నడని పరేషాన్ కాకండి.. మిటమిన్లు అంటే ఆయన భాషలో కోట్లాది రూపాయలన్నమాట. తాను చేయనని అంటూనే ఒక మెలిక పెట్టారట. అదేమిటంటే.. నెల్లూరు ఎంపీగా తనను పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి తెస్తే తన వారసుడికి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కానీ లేదా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలట. అంటే తనతోపాటు తన కుమారుడికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని చెప్పకనే చేప్పేశారు మంత్రి. ఒకవేళ నెల్లూరు ఎంపీగా ఎవరైనా బరిలోకి దిగితే తాను సర్వేపల్లి నుంచి పోటీ చేస్తానని, తన కుమారునికి నెల్లూరు గ్రామీణ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబును మంత్రి సోమిరెడ్డి కోరేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేగాకుండా.. పార్టీలో తానెంత ప్రత్యేకతో మంత్రి చెప్పుకోవడం గమనార్హం.
పార్టీ మారని ఏకైక నాయకునిగా తాను కాక మరెవరున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారట. కాంగ్రెస్ నాయకులు తనను ప్రలోభపెట్టినా పార్టీ మారలేదని అంటూ తానెంత నికార్సైన నాయకుడో చెప్పుకొస్తున్నారు. , ఎన్నికల్లోఎన్నిసార్లు వెనుకంజ వేయలేదని, ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మంత్రిని చేశారని అటువంటి నాయకునికి అండగా ఉండడమే తన ధ్యేయమని చెబుతున్నారట మంత్రిగారు. ఇలా తన ప్రత్యేకతను చెబుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తనతోపాటు తనయుడికీ టికెట్ సంపాదించుకోవాలని ఆయన చూస్తున్నారట. అయితే.. సోమిరెడ్డి కోరికలపై సీఎం చంద్రబాబుఎలా స్పందిస్తారో చూడాలి మరి.