ఎన్నికలు దగ్గర పడనున్నడటం తో నాయకులందరూ పార్టీ జంపింగులకు సిద్ధం అయ్యారు ప్రజలు ఏమనుకుంటారో అన్న విషయాన్ని వారెప్పుడో గాలికి వదిలేశారు వారి స్వంత ప్రయోజనాలు వారికి ముఖ్యం. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన సునీల్ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్ధానిక నేతలతో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే వైసిపికి రాజీనామా చేయాలని సునీల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని వైసిపి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే, వివాదాలేంటనే విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు.
జిల్లాలోని పారిశ్రామికవేత్తల్లో సునీల్ కూడా ఒకరు. 2009లో ప్రజా రాజ్యం పార్టీ, 2014లో వైసిపి నుండి కాకినాడ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. కాపు సామాజికవర్గానికి చెందిన నేత అయినా సరైన అనుభవం లేక రెండు సార్లూ ఓడిపోయారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో వైసిపి తరపున పోటీకి రెడీ అవుతున్న సునీల్ కు స్ధానిక నేతలు బాగా చికాకులు పెడుతున్నారట. దానికితోడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో కూడా జగన్ నుండి స్పష్టమైన హామీ రాలేదట. దాంతో సునీల్ టిడిపి, జనసేన వైపు చూస్తున్నారు.
అదే సమయంలో పై రెండు పార్టీల నేతలు కూడా సునీల్ తో మంతనాలు మొదలుపెట్టారు. ఎవరికి వారుగా తమ అధినేతల తరపున సునీల్ కు హామీలిచ్చేస్తున్నారు. అయితే, తాను మాత్రం ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. సునీల్ తమ్ముడు గోపి కూడా పారిశ్రామికవేత్తే. ఆయనేమో టిడిపిలోనే చేరమని ఒత్తిడి పెడుతున్నారట. తొందరలోనే ఏ పార్టీలో చేరాలనే విషయంలో మద్దతుదారులతో సమావేశమై నిర్ణయించుకోవాలని సునీల్ అనుకుంటున్నారు. మరి సునీల్ అనుకుంటున్నట్లు ఏ పార్టీ ప్యాకేజికి ఒప్పుకుంటుందో చూడాలి.