ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యవహారం మళ్ళీ చర్చకు వచ్చింది. ఎందుకంటే వెంకయ్యకు ఉప రాష్ట్రపతి అయిన తర్వాతే ప్రజాస్వామ్యం, విలువలు, స్పీకర్ల బాధ్యతలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చేస్తున్నాయి. ముప్పవరపు ఉప రాష్ట్రపతి అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో పెద్ద కార్యక్రమం జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వెంకయ్య గురించి మోడి, మన్మోహన్ మహా గొప్పగా మాట్లాడారు లేండి.
విలువల గురించి మాట్లాడుతున్న వెంకయ్య
చివరగా వెంకయ్య చాలా మాటలే మాట్లాడినా పనిలో పనిగా ప్రజాస్వామ్యం విలువలు గురించి కూడా మాట్లాడటమే ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా ఫిరాయింపుల గురించే వెంకయ్య మాట్లాడారు. ఒక పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులు మరొక పార్టీ కండువాను కప్పుకోవటం ఏ విలువలకు నిదర్శనమంటూ ప్రశ్నించారు. ఒక వేళ పార్టీ మారదలచుకుంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని బుద్దులు చెప్పారు. స్పీకర్ కూడా ఎక్కువ కాలయాపన చేయకుండా మూడు నెలల్లోనే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్లకు చెప్పారు.
రాజ్యాంగం అంటే నమ్మకముందా ?
నిజానికి ఈ విషయాలు వెంకయ్య చెప్పాల్సిన పనేలేదు. ప్రజాస్వామ్యం. రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకమున్నా, విలువలు పాటించే వాళ్ళయితే ఎవరికి వారుగా చేయాల్సిన పనే అది. పార్టీ మారదలుచుకున్న ప్రజా ప్రతినిధుల నుండి స్పీకర్లు రాజీనామాలు తీసుకుని ఆమోదించాలి. రాజీనామాలు చేయకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కానీ స్పీకర్లు ఆపని చేయటం లేదు. ఎందుకంటే, సభాపతుల నుండి వచ్చే ఆదేశాలకు లొంగిపోయి స్పీకర్లు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న విషయం అందరూ చూస్తున్నదే. తెలంగాణా, ఏపి అయినా చిరవకు లోక్ సభ అయినా అదే పద్దతి. వెన్నెముక లేని నేతలు స్పీకర్లుగా, రాజ్యాంగాన్ని గౌరవించాలన్న ఆలోచన లేని నేతలు సభాపతులుగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి వలువలుండవంతే.
ఫిరాయింపులు ఇపుడు జరిగినవి కావు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తెలంగాణా, ఏపిలో ఎంఎల్ఏల ఫిరాయింపులు లేకపోతే లోక్ సభలో ఎంపిల ఫిరాయింపులు వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నపుడు జరిగినవే. ఇపుడు బుద్దులు చెబుతున్న వెంకయ్య ఆనాడు ఎందుకు మాట్లాడలేదు ? మోడితో చెప్పి పార్టీ ఫిరాయించిన వైసిపి ఎంపిలపైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చెప్పి ఎంఎల్ఏలపైన చర్యలు తీసుకునేట్లు ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు ?
ఇపుడైనా చర్యలు తీసుకోమని చెప్పచ్చు కదా ?
పోనీ కేంద్రమంత్రిగా పదవి కాపాడుకునేందుకు ప్రధాని అడుగులకు మడుగులొత్తారనుకున్నా ఉప రాష్ట్రపతి అయిన తర్వాతైనా రాజ్యాంగాన్ని కాపాడాలని మోడితో పాటు ముఖ్యమంత్రులకు ఎందుకు చెప్పటం లేదు ? ప్రధానిని ఆదేశించే స్ధాయి వెంకయ్యకు లేదని అనుకున్నా తెలుగు ముఖ్యమంత్రులకన్నా చెప్పాలి కదా ? కెసిఆర్ మాట వినడని అనుకున్నా కనీసం చంద్రబాబునాయుడుకైనా చెప్పాలి కదా ? రాజ్యంగబద్దమైన పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రులు రాజ్యాంగాన్ని అనుసరించేట్లు చేయలేని వెంకయ్య ఎవరికి బుద్దులు చెబుతున్నట్లు ?